Rain Alert | రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్న సంగతి తెలిసిందే. మండుటెండలకు ఉక్కిరిబిక్కిరి అవుతున్న నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లని కబురు అందించింది. మంగళ, బుధవారాల్లో ఆయా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
ద్రోణి, ఉపరితల చక్రవాత ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో ఇవాళ, రేపు ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఇవాళ నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
21 నుంచి పెరగనున్న ఎండల తీవ్రత
ఇవాళ, రేపు మోస్తరు వర్షాలతో ఉపశమనం లభించినప్పటికీ.. 21 నుంచి ఎండలు దంచికొట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న నాలుగు రోజులు ఉష్ణోగ్రతలు భారీగా నమోదయ్యే అవకాశం ఉంది. వడగాలుల తీవ్రత కూడా పెరిగే అవకాశం ఉన్నందున పిల్లలు, వృద్ధులు, కూలీలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.
