విధాత: ‘వారణాసి’ మూవీ (Varanasi movie) ఈవెంట్లో హనుమంతుడిపై దర్శకుడు రాజమౌళి చేసిన వ్యాఖ్యల(Rajamouli comments controversy) పై వివాదం ముదురుతుంది. తాజాగా రాజమౌళి వ్యాఖ్యలపై బీజేపీ నేత చికోటీ ప్రవీణ్(Chikoti Praveen)స్పందించారు. రాజమౌళి తీరు “మదం ఎక్కిన ఏనుగు మురికి కాల్వలో పడ్డట్టు” ఉందని విమర్శించారు. రాజమౌళి వెంటనే హిందువులకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. “దేవుడి పేరుతో సినిమా తీసి డబ్బులు సంపాదించే నీవు ఇలా మాట్లాడటం తగదు. అహంకారంతో వెళ్తే నీ పతనం ఖాయం ” అని అని హెచ్చరించారు.
రామోజీ ఫిల్మ్ సిటీలో ఇటీవల జరిగిన గ్లోబ్ట్రాటర్ ఈవెంట్లో హనుమంతుడిపై రాజమౌళి చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని రాష్ట్రీయ వానరసేన సంఘం సభ్యులు ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని సరూర్నగర్ పోలీసులు వెల్లడించారు. మహేశ్ బాబు హీరోగా రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ నిమా టైటిల్ లాంఛ్ ఈవెంట్ను రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించారు. ఈవెంట్ స్కీన్ పై టైటిల్ లాంచ్ ప్రదర్శనకు ముందు సాంకేతికలోపం తలెత్తడంతో ఈవెంట్కు కొంతసేపు అంతరాయం కలిగింది. దీంతో ఆందోళనకు గురైన రాజమౌళి..తనకు దేవుడి మీద నమ్మకం లేదని..అయితే మా నాన్న నా దగ్గరకు వచ్చి ‘హనుమంతుడి వెనక ఉండి నడిపిస్తాడు’ అని చెప్పారు. ఇలా జరిగిన వెంటనే కోపం వచ్చింది. నా భార్యకు హనుమంతుడు అంటే చాలా ఇష్టం. ఆయనను తన స్నేహితుడిలా భావిస్తుంది. నా భార్య మీద కూడా కోపం వచ్చింది. ఇలానేనా ఆయన చేసేది అనిపించింది’’ అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
‘వారణాసి’ టైటిల్( Title Dispute)పై మరో వివాదం
మరోవైపు వారణాసి సినిమా టైటిల్ తమదేనని, ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్నామని రామ భక్త హనుమ క్రియేషన్స్ బ్యానర్ రాజమౌళిపై ఫిల్మ్ ఛాంబర్ లో ఫిర్యాదు చేసింది. మహేష్ మూవీ ఎనౌన్స్మెంట్ కన్నా ముందే తమ బ్యానర్లో వారణాసి టైటిల్ తో సినిమా అనౌన్స్ చేసి పోస్టర్ రిలీజ్ చేసినట్టు చిరపురెడ్డి సుబ్బారెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. టైటిల్ హక్కులు తమవే అంటూ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో టైటిల్ రిజిస్టర్ సందర్భంగా ఇచ్చిన కాపీని కూడా ఆయన మీడియాకు రిలీజ్ చేశాడు. దీనిపై ఫిల్మ్ ఛాంబర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
