Krishna Water Disputes | కృష్ణా జ‌లాల్లో తెలంగాణ‌కు తీర‌ని న‌ష్టం : సమీక్షలో రేవంత్‌ రెడ్డి

  • Publish Date - July 14, 2025 / 10:23 PM IST

Krishna Water Disputes | కృష్ణా నదీ జలాల వినియోగంలో ఇంతకాలం తెలంగాణకు తీరని ద్రోహం జరిగిందని రేవంత్ అన్నారు. గడిచిన పదేండ్లలో అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం కృష్ణా జలాల్లో న్యాయపరంగా రావాల్సిన నీటి కోటా సాధించటంలో దారుణంగా విఫలమైందన్నారు. తెలంగాణకు 299 టీఎంసీలు మాత్రమే నీటి వాటాకు అంగీకరించి ఏపీకి 512 టీఎంసీలు కట్టబెట్టిందని రేవంత్ అన్నారు.. శ్రీశైలం ఎగువన ఏపీ అక్రమంగా నిర్మించుకున్న ప్రాజెక్టులన్నింటికీ కేసీఆర్‌ వంత పాడి, కృష్ణా నీళ్లను ఏపీ యథేచ్ఛగా మళ్లించుకుంటే మౌనం వహించిందని సీఎం రేవంత్ ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణాపై తెలంగాణ‌లో నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు ఇవ్వకుండా అసంపూర్తిగా వదిలేసిందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అటు గోదావరిపై తుమ్మిడిహెట్టిపై చేపట్టిన ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టుకు రూ.11 వేల కోట్లు ఖర్చు చేసిన తర్వాత నాటి కేసీఆర్ ప్ర‌భుత్వం పక్కనబెట్టిందన్నారు. దానికి బదులు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి లక్ష కోట్లకు పైగా ప్రజాధనం దుర్వినియోగం చేసిందని ఆయ‌న ఆరోపించారు.

ఈ నెల‌ 16న ఢిల్లీకి సీఎం రేవంత్‌, మంత్రి ఉత్త‌మ్‌

కృష్ణా, గోదావ‌రి జ‌లాల్లో నీటి వాటా కోసం కేంద్ర ప్ర‌భుత్వంపై ఒత్తిడి చేయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నిర్ణ‌యించారు. ఈ మేర‌కు సోమ‌వారం కేంద్ర జ‌ల్‌శ‌క్తి శాఖ మంత్రికి నీటి పారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్‌రెడ్డి లేఖ రాశారు. అలాగే ఈనెల‌16వ తేదీన ఉత్త‌మ్ కుమార్ రెడ్డితో క‌లిసి కేంద్ర జ‌ల‌శ‌క్తి శాఖ మంత్రితో స‌మావేశం కానున్నారు. ఈ మేర‌కు రేవంత్‌రెడ్డి, ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి బుధ‌వారం ఉద‌యం అధికారుల‌తో క‌లిసి ఢిల్లీ వెళ్ల‌నున్న‌ట్లు స‌మాచారం. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు రావాల్సిన ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకోవాలని, న్యాయపరంగా రావాల్సిన నీటి వాటాల సాధనకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలన్న నిర్ణ‌యంతో సీఎం ఉన్నారు.

ప్రాజెక్ట్‌ల క్లియ‌రెన్స్ కోసం కేంద్రంపై ఒత్తిడి

కేంద్ర జ‌ల‌శ‌క్తి శాఖ మంత్రితో జ‌రిగే భేటీలో కృష్ణాపై తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులకు వెంటనే క్లియరెన్స్ ఇవ్వాలని, నీటి కేటాయింపులతో పాటు ప్రాజెక్టుల నిర్మాణానికి ఆర్థిక సాయం అందించాలని ఈ సంద‌ర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నారు. కృష్ణాతో పాటు గోదావరి జలాల విషయంలో తెలంగాణ ప్రయోజనాలను పరిరక్షించుకోవటంతో పాటు, ఇంతకాలం జరిగిన అన్యాయానికి శాశ్వతమైన పరిష్కారాలను సాధించాలని భావించారు. ఈ మేర‌కు నీటిపారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్‌తో సీఎం మాట్లాడారు. సీఎం సూచనలతో మంత్రి ఉత్తమ్ కేంద్ర జల వనరుల శాఖ మంత్రి సీఆర్ పాటిల్ కు లేఖ రాశారు. కేంద్ర జల శక్తి మంత్రితో జ‌రిగే స‌మావేశంలో తెలంగాణ నీటి వాటాల సాధనతో పాటు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల అనుమతులు, నీటి కేటాయింపులు, కొత్త ప్రాజెక్టులకు పట్టుబట్టాలని నిర్ణయించారు.