సూర్యాపేట జిల్లా కోదాడ దుర్గాపురం స్టేజి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది, ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది
మృతుల కుటుంబాలకు సీఎం సంతాపం
విధాత: సూర్యాపేట జిల్లా కోదాడ దుర్గాపురం స్టేజి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది, ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే హైదరాబాద్ నుండి విజయవాడలో గుణదలలో పాపకు చెవులు కుట్టించేందుకు కారులో వెళుతుండగా కోదాడ దుర్గపురం స్టేజి వద్దకు రాగానే ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీ కొట్టారు. దీంతో కారులో ప్రయాణిస్తున్న జిల్లా శ్రీకాంత్ ,మాణిక్యమ్మ, చందర్రావు, కృష్ణంరాజు,స్వర్ణ, లాస్య అక్కడికక్కడే మృతి చెందారు.
మృతుల్లో ఐదుగురు బోనకల్లు మండలం గోవిందపురం గ్రామానికి చెందిన వారు కాగా, ఒకరు కోదాడ మండలం చిమిర్యాల గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. గాయపడిన నలుగురిని స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతిచెందిన వారి కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.