బండి సంజయ్ కొడుకుపై లుక్ అవుట్ నోటీసులివ్వాలి : ఆర్ఎస్ ప్రవీణ్ డిమాండ్

బండి సాయి భగీరథ్‌పై లుక్ అవుట్ నోటీసులు జారీ చేసి వెంటనే అరెస్ట్ చేయాలని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. కేసు విచారణపై తీవ్ర విమర్శలు చేశారు.

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు బండి సాయి భగీరథ్ పై ఫోక్సో కేసు నమోదైన నేపథ్యంలో అతడిని అరెస్టు చేసేందుకు లుక్ అవుట్ నోటీసులివ్వాలని, నిందితుడి ఆచూకి తెలిపిన వారికి, పట్టుకున్నవారికి రివార్డు ప్రకటించాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేసు పారదర్శక విచారణకు హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రధాని మోదీతో మాట్లాడి బండి సంజయ్ ను కేంద్ర కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలన్నారు. బండి సంజయ్ కొడుకు కేసులో సీఎం, హోం మంత్రిగా రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాప్ అయ్యారని, ఈ కేసులో బండి సంజయ్ ని ఎ2గా, సంగప్పను ఎ3 గా ఎఫ్ఐఆర్ లో యాడ్ చేయాలని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. సాయి భగీరథ్ పై కేసు నమోదై మూడు రోజులు గడుస్తున్నా ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదని నిలదీశారు. బాధిత కుటుంబాన్ని బెదిరించి, కేసు వాపస్ తీసుకోవాలని భయపెట్టడానికి పోలీసులే కావాలని అరెస్ట్ చేయడం లేదని, నిందితునికే పోలీసులు సహకరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

నిందితుడిపై కేసు నమోదులో జాప్యం..బాధితురాలపై నిమిషాల్లో కేసు

బాధిత అమ్మాయి తల్లి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడానికి వెళ్తే పేట్ బషీరాబాద్ పోలీసులు 5 గంటల పాటు ఎందుకు పట్టించుకోలేదు? బండి సాయి భగీరథ్ అమ్మాయిపై ఫిర్యాదు చేసిన 2 నిమిషాల్లోనే ఎలా ఎఫ్ఐఆర్ చేశారో పోలీసులు సమాధానం చెప్పాలని ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. పోలీసులు సాయి భగీరథ్ పై ఉద్దేశ్యపూర్వకంగా సెక్షన్ 11, 12 ప్రకారం చిన్న చిన్న కేసులు నమోదు చేశారన్నారు. వాస్తవానికి సెక్షన్ 7, 8 ప్రకారం అతనిపై కనీసం 20 ఏళ్ల జైలు శిక్ష పడేలా కేసులు పెట్టాలన్నారు. నిందితునిపై సెక్షన్ 6 ప్రకారం కూడా కేసు పెట్టాలన్నారు. సైబరాబాద్ పరిధిలో ఉన్న ఎస్ఓటి, టాస్క్ ఫోర్స్ పోలీసులు ఏం చేస్తున్నారని, నిందితున్ని ఎందుకు పట్టుకోవడంలేదన్నారు. ఈ కేసులో నిర్లక్ష్యం వహించిన ఇన్ స్పెక్టర్, ఏసీపీలను, బాధ్యులైన పోలీసు అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని రాష్ట్ర డీజీపీని కోరారు.

పారదర్శక విచారణకు బండి సంజయ్ ని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలి

బాలల హక్కుల కమీషన్, మానవ హక్కుల సంస్థలు స్పందించి రాష్ట్ర ఛీఫ్ సెక్రటరీ, రాష్ట్ర డీజీపీకు లేఖలు రాసి నిందితుడిని అరెస్ట్ చేయించాలని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. బండి సంజయ్ కూడా బాధిత కుటుంబాన్ని బెదిరించారని, ఆయన కేంద్ర హోం శాఖ మంత్రిగా ఉంటే కేసును ప్రభావితం చేస్తారని, బాధిత కుటుంబాన్ని బెదిరిస్తారని.. అందుకే దేశ హోం మంత్రి అమిత్ షా, ప్రధాని మోడీతో మాట్లాడి బండి సంజయ్ ని మంత్రి పదవి నుండి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. గతంలో వీ6 రిపోర్టర్ గా పనిచేసి, ఇపుడు బీజేపి అధికార ప్రతినిధిగా ఉన్న సంగప్ప కూడా బాధితులను తీసుకొచ్చి బండి సంజయ్ తో కలిపించి బెదిరింపులకు పాల్పడ్డారన్నారు. అందుకే బండి సంజయ్ ఏ2, సంగప్ప ఏ3 గా ఎఫ్ఐఆర్ లో చేర్చాలని కోరుతున్నామన్నారు.

సీఎంగా, హోంశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి విఫలం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్నటి ప్రధాని మోదీ అధికారిక కార్యక్రమంలో బండి సంజయ్ తమ ప్రియ మిత్రుడని చెప్పుకున్నారని, అందుకే బండి సంజయ్ కొడుకును అరెస్ట్ చేయడం లేదని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు . హైదరాబాద్ లో మాజీ డీజీపీ భార్యను హత్య చేసినా అడిగే నాధుడే లేడని, తెలంగాణలో శాంతి భధ్రతలు ప్రమాదంలో ఉన్నాయన్నారు. రేవంత్ రెడ్డి హోం శాఖ మంత్రిగా ,ముఖ్యమంత్రిగా విఫలమయ్యారన్నారు. రేవంత్ రెడ్డి కింద లక్ష మంది పోలీసులు, క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ వంటివి ఉన్నాయని, ఘటన జరిగినప్పటి నుండి ఇప్పటివరకు ఎందుకు ఆధారాలు సేకరించలేదని, అత్యాచారానికి పాల్పడిన ప్రాంతాలను ఎందుకు విజిట్ చేయలేదని అడిగారు.

బండి కేసు డైవర్షన్ కోసమే మళ్లీ ఫోన్ ట్యాపింగ్..ఫార్ములా ఈ కారు రేస్ కేసులు

బండి సంజయ్ కొడుకు కేసు నుంచి ప్రజల దృష్టిని మళ్లీంచేందుకు సీఎం రేవంత్ రెడ్డి అటెన్షన్ డైవర్షన్ లో భాగంగా ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ రేస్ కేసులు బయటకు తీయాలని చూస్తున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పై ఈడీ కేసులు, సీబీఐ కేసులు ఉన్నాయని, అందుకే కేంద్ర ప్రభుత్వానికి భయపడి ఒక మైనర్ అమ్మాయికి అన్యాయం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.

సోషల్ మీడియా దుష్ప్రచారంపై చర్యలు తీసుకోవాలి

గృహ లక్ష్మి, మహా లక్ష్మి పేరుతో పథకాలు పెట్టి మహిళల గురించి గొప్పలు చెప్పుకున్న కాంగ్రెస్ నాయకులు మైనర్ అమ్మాయికి ఎందుకు న్యాయం చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మంత్రులు, మహిళా నాయకురాల్లు ఎందుకు పోక్సో కేసు గురించి మాట్లాడడం లేదని ప్రశ్నించారు. శాంతి భద్రతలు రాష్ట్ర పరిధిలోకి వస్తాయని, బాధిత అమ్మాయికి న్యాయం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర హోం మంత్రి రేవంత్ రెడ్డిపైనే ఉందన్నారు. కాంగ్రెస్ నాయకులు, సోషల్ మీడియా కార్యకర్తలు ఈ విషయం తెలుసుకోవాలన్నారు. బీజేపీ సోషల్ మీడియాలో అమ్మాయి గురించి తప్పుడు ప్రచారం చేస్తూ, బాధిత కుటుంబం గురించి దుష్ప్రచారం చేస్తున్న వారిపై పోలీసులు ఎందుకు కేసులు పెట్టడం లేదని ప్రశ్నించారు. గతంలో జర్నలిస్ట్ రేవతిని అర్థరాత్రి 2 గంటలకు అరెస్ట్ చేసినట్టు, క్రిశాంక్ పై 35 కేసులు పెట్టినట్టు బీజేపీ కార్యకర్తలపై ఎందుకు పెట్టడం లేదన్నారు?

పక్కన కూర్చోబెట్టుకున్నందుకు మోదీ క్షమాపణ చెప్పాలి

సాయిభగీరథ్ పై బీఆర్ఎస్ పార్టీ నాయకులే కేసులు పెట్టించారని బీజేపీ నాయకులు మాట్లాడడం విడ్డూరంగా ఉందని, నిందితుడు మైనర్ అమ్మాయిపై కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిన తర్వాతనే మాకు తెలిసిందని స్పష్టం చేశారు. అసత్య ఆరోపణలు చేయడం మారాలని, వాట్సాప్ యూనివర్సిటీ తెలివి చూపించకూడదని సూచించారు. బీజేపీ అగ్రనాయకత్వం భేటీ బచావో అని చెప్పి, కేంద్ర మంత్రి బేటా బచావో అమలు చేస్తుందని విమర్శించారు. మైనర్ అమ్మాయిని వేధించిన మంత్రిని ప్రధాని మోదీ తన పక్కన కూర్చోబెట్టుకున్నందుకు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. మహిళలకు మోదీ ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ విమర్శించారు.

ప్రజా సంఘాలు స్పందించాలి

బండి సంజయ్ నిన్నటి సికింద్రాబాద్ బీజేపీ సభలో నేను ఆర్ఎస్ఎస్, ఏవీబీపీ, ,యువ మోర్చా, బీజేపీలో పని చేశానని కన్నీరు పెట్టుకుంటూ డ్రామాలు చేస్తున్నారని.. తన కుమారుడు ఎలాంటి తప్పు చేయకపోతే పోలీసులకు అప్పగించి విచారణకు సహకరించాలన్నారు. గత మూడు రోజులుగా పోలీసుల మౌనం అనేక అనుమానాలు కలిగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మైనర్ అమ్మాయికి వ్యతిరేకంగా కుల సంఘాలు మాట్లాడడం, బండి సంజయ్ ని కాపాడుకుంటామనడం దారుణమన్నారు. అమ్మాయి కూడా బండి సంజయ్ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయేనని, కుల సంఘాల నాయకులు అమ్మాయికి ఎందుకు అన్యాయం చేయాలని చూస్తున్నారని ప్రవీణ్ కుమార్ నిలదీశారు. ఈ ఘటనపై సామాజిక ఉద్యమకారులు మందకృష్ణ మాదిగ, ఇతర ప్రజా సంఘాల నాయకులు, యువత కూడా స్పందించి మైనర్ అమ్మాయికి న్యాయం జరిగేలా చూడాలని, పార్టీలకు రాజకీయాలకు అతీతంగా అమ్మాయికి న్యాయం చేయాలని పిలుపునిచ్చారు.

ఇవి కూడా చదవండి :

అభివృద్ది కోణంలోనే ‘హమ్ సే మిలో’ మాటలు : సీఎం రేవంత్ రెడ్డి
జర్నలిస్టుల ఇళ్లపై జూన్ 2 లోపు నిర్ణయం : సీఎం రేవంత్ రెడ్డి

Latest News