Telangana BC Reservations : బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ సర్కార్ కు సుప్రీం షాక్

తెలంగాణ ప్రభుత్వానికి బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో బిగ్ షాక్ తగిలింది. 42% రిజర్వేషన్ల జీవో 9పై హైకోర్టు స్టేను సవాల్ చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన SLPని సుప్రీంకోర్టు కొట్టివేసింది. పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలకు వెళ్లవచ్చని సూచించింది.

Telangana BC Reservations : బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ సర్కార్ కు సుప్రీం షాక్

న్యూఢిల్లీ : బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అంశంలో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురైంది. జీవో నెంబర్‌ 9పై హైకోర్టు విధించిన స్టేను ఎత్తేయాలని దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. హైకోర్టులో విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఇక్కడ విచారణ కొనసాగిస్తే హైకోర్టు విచారణపై ప్రభావం పడొచ్చని, ఈ దశలో పిటిషన్‌ను స్వీకరించబోమని చెబుతూ ద్విసభ్య ధర్మాసనం అభిప్రాయపడింది. అందుకే స్పెషల్ లీవ్ పిటిషన్ ను తిరస్కరిస్తున్నట్లుగా పేర్కొంది. తమ ఆదేశాలతో సంబంధం లేకుండా తదుపరి విచారణ చేపట్టాలని.. మెరిట్స్‌ ప్రకారం విచారించాలని హైకోర్టుకు సూచించింది. అయితే స్థానిక సంస్థల ఎన్నికలను పాత 50శాతం రిజర్వేషన్ అనుసరించి నిర్వహించుకోవచ్చని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

స్థానిక సంస్థలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పేరిట తెలంగాణ ప్రభుత్వం జీవో నెంబర్‌ 9ని జారీ చేయడం..ఆ జీవోపై తెలంగాణ హైకోర్టు స్టే విధిస్తూ.. విచారణ ఆరు వారాలకు వాయిదా వేయడం జరిగింది. అయితే హైకోర్టు కూడా 50శాతం రిజర్వేషన్ల పరిమితి మీంచకుండా ఎన్నికలు నిర్వహించుకోవచ్చని తన ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 42 శాతం బీసీ రిజర్వేషన్లను కొనసాగించాలన్న పట్టుదలతో హైకోర్టు స్టే ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ను.. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం గురువారం విచారించింది. ఇరువైపులా వాదనలు విన్న తర్వాత.. ఈ అంశం హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున విచారణకు స్వీకరించలేమంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో సంబంధం లేకుండా తదుపరి విచారణ చేపట్టాలని తెలంగాణ హైకోర్టుకు సూచించింది. మెరిట్స్‌ ప్రకారం విచారణ కొనసాగించాలని సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం కావాలనుకుంటే ప్రభుత్వం పాత రిజర్వేషన్లు 50శాతంతో ఎన్నికలకు వెళ్లవచ్చని పేర్కొంది. హైకోర్టులో విచారణ యధాతథంగా కొనసాగుతుందని.. అక్కడే తేల్చుకుని రావాలని పిటిషనర్‌ తరఫు లాయర్‌కు స్పష్టం చేసింది.

పోటాపోటీగా వాదనలు

తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపిస్తూ.. రిజర్వేషన్లు నిర్ణయించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని.. తెలంగాణ బీసీ బిల్లులకు రాష్ట్రపతి, గవర్నర్ ఆమోదం ఇవ్వలేదని… అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీలు బీసీ రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం తెలిపాయని వివరించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా పకడ్బందీగా శాస్త్రీయంగా కుల సర్వే నిర్వహించామని, ఇంటింటికి తిరిగి సామాజిక ఆర్థిక కుల సర్వే నిర్వహించారని, సమగ్రంగా , సాంకేతికంగా సర్వే జరిపామని, అన్ని వర్గాలతో విస్తృత సంప్రదింపులు జరిపామన్నారు. గవర్నర్ బిల్లు పెండింగ్లో పెట్టడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని.. ఏకాభిప్రాయంతో ఆమోదించిన బిల్లును పెండింగ్ లో పెట్టారన్నారు. బిల్లును ఛాలెంజ్ చేయకుండా బిల్లు ద్వారా విడుదల చేసిన జీవోను మాత్రమే సవాల్ చేశారని… రిజర్వేషన్లను పెంచుకునే సౌలభ్యం ఇందిరా సహానీ జడ్జిమెంట్ లో 9 మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు విధించిన ట్రిపుల్ టెస్ట్ కండిషన్ ను కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిందన్నారు. డెడికేటెడ్ కమిషన్ ద్వారా సర్వే జరిపి ఎంపరికల్ డేటా సేకరించిందని వివరించారు. కమిషన్ సిఫారసు ప్రకారం రిజర్వేషన్లు నిర్ణయించామని, బీసీ జనాభా డేటా ఆధారంగానే బీసీల రిజర్వేషన్లు పెంచామని తెలిపారు. దీనిపైన స్టే ఎలా విధిస్తారు ? అని వాదించారు.

డేటా బేస్ ఆధారంగా రిజర్వేషన్లు నిర్ణయించుకోవచ్చని ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని గుర్తు చేశారు. హైకోర్టు మధ్యంతర తీర్పులో ఎలాంటి సహేతుక కారణాలు లేవు అని, వెంపరికల్ డేటా ద్వారా ట్రిపుల్ టెస్ట్ నిర్వహించి రిజర్వేషన్లు పెంచుకోవచ్చని గౌలి కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందన్నారు. ఈ దశలో బెంచ్‌ జోక్యం చేసుకుని.. ఎస్టీ ప్రాంతాలలోనే రిజర్వేషన్ల పెంపుకు మినహాయింపులు ఉన్నాయి కదా ? అని ప్రశ్నించింది.

రిజర్వేషన్ల పరిమితిపై ఉల్లంఘన

ప్రతివాది మాధవరెడ్డి తరఫు లాయర్‌ వాదనలు వినిపిస్తూ.. రిజర్వేషన్లు 50 శాతానికి మించి ఉండకూడదని సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో స్పష్టం చేసిందన్నారు. షెడ్యూల్డ్ ఏరియా ,గిరిజన ప్రాంతాలలో మాత్రమే 50 శాతానికి మించి రిజర్వేషన్లు పెంచుకునేందుకు అనుమతి ఉందని… జనరల్ ఏరియాలలో రిజర్వేషన్లను 50 శాతానికి మించి పెంచడానికి వీలులేదు అని గుర్తు చేశారు. తెలంగాణలో అలాంటి షెడ్యూల్ ఏరియాలు లేవు అని.. కృష్ణమూర్తి కేసులో సుప్రీంకోర్టు ఇదే తీర్పు వెల్లడించిందని తెలిపారు. మహారాష్ట్ర ,మధ్యప్రదేశ్ లో కూడా సుప్రీంకోర్టు రిజర్వేషన్ల పెంపును తిరస్కరించిందన్నారు. ట్రిపుల్ టెస్ట్ లో కూడా 50 శాతానికి మించి రిజర్వేషన్ ఉండదు అని వాదించారు. ఇరువర్గాల వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం స్పెషల్ లీవ్ పిటిషన్ కొట్టివేసి.. 50 శాతానికి మించకుండా స్థానిక ఎన్నికలకు వెళ్లాలని సూచించింది. దీంతో హైకోర్టు విచారణపై మరోసారి అందరి ఫోకస్ పడింది.