Heavy Rains : ఈ నెల 14 వరకు తెలంగాణలో భారీ వర్షాలు: పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

తెలంగాణలో సెప్టెంబర్ 14 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం. పలు జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

Reported by: Tejaswini Nanna | తెలంగాణ‌ | Sep 10, 2025, 4:41 pm IST
Read Time: 3 mins
Heavy Rains : ఈ నెల 14 వరకు తెలంగాణలో భారీ వర్షాలు: పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

తెలంగాణలో ఈ నెల 14వ తేదీ వరకు బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.ఈ నెల 11, 12 తేదీల్లో ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. హైదరాబాద్ లో కూడా వచ్చే నాలుగు రోజులు వర్షాలు కురుస్తాయి. అయితే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మాత్రమే హైదరాబాద్ లో కురిసే ఛాన్స్ ఉంది. బుధవారం నాడు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. బుధవారం రోజున ఆదిలాబాద్, కుమరంభీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి, మహబూబాబాద్, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. గురువారం నాడు కుమరంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి. పలు జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

గత నెలలో కామారెడ్డి, నిర్మల్, మెదక్ జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. ఈ వర్షాలతో ఈ మూడు జిల్లాలతో పాటు ఇతర జిల్లాల్లో కూడా భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. పంటలు దెబ్బతిన్నాయి. రోడ్లు పాడయ్యాయి. వర్షాలతో దెబ్బతిన్న ప్రాంతాలను సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారు. రాష్ట్రంలో వర్షాలతో జరిగిన నష్టంపై కేంద్ర హోంశాఖ అమిత్ షాకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వినతి పత్రం సమర్పించారు. విపత్తు నిధులు అందించాలని కోరారు. రెండు రోజులుగా ఢిల్లీలోనే ఉన్న సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రానికి నిధులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రులను కలిశారు.