విధాత, హైదరాబాద్ : తెలంగాణా రాష్ట్రాన్ని రానున్న రోజుల్లో అభివృద్ధి, సంక్షేమ రంగంలో అగ్రగామిగా నిలబెట్టే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ విజన్ -2047 డాక్యుమెంటు ను రూపొందిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షలకు అనుగుణంగా రూపొందిస్తున్న ఈ విజన్ 2047 డాక్యుమెంట్ తయారీలో ప్రతి ఒక్క పౌరుడు భాగస్వామ్యం పొందేలా సిటిజన్ సర్వే చేపట్టారు. అక్టోబర్ 10 వ తేదీన ప్రారంభమైన ఈ సర్వేలో రాష్ట్ర ప్రజలు, ఎన్.ఆర్.ఐ లు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. కాగా, ఈ తెలంగాణ రైజింగ్ విజన్ -2047 సర్వే లో రాష్ట్రంలోని ప్రతీ ఉద్యోగి పాల్గొని తమ విలువైన సలహాలు, సూచనలు అందించాల్సిందిగా కోరుతూ.. రాష్ట్ర ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది.
ఈనెల 25 వ తేదీ వరకు జరిగే విజన్-2047 సర్వేలో అందరు ఉద్యోగులు పాల్గొనడంతోపాటు ఈ సర్వే లింక్ ను, క్యూఆర్ కోడ్ ను తమ తమ కార్యాలయాల్లో ప్రదర్శించాలని కోరింది. అలాగే ఈ కార్యక్రమంపై విస్తృత ప్రచారం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జారీ చేసిన ఆ సర్క్యులర్ లో ఆదేశించారు. ఈ సర్వేలో పాల్గొనేందుకుగాను http //www.telangana.gov.in/telanganarising/ అనే లింక్ ద్వారా పాల్గొనాలని ఒక ప్రకటనలో తెలియచేసింది.