తెలంగాణ, ఏపీ ఉద్యోగుల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం కొత్త నిర్ణయాలేమీ తీసుకోలేదని, రాష్ట్రం ఏర్పడిన ఏడాది రెండేండ్లలోనే ఉద్యోగుల పంపిణీ ప్రక్రియ దాదాపుగా కొలిక్కి వచ్చిందని అధికారవర్గాలు తెలిపాయి.
హైదరాబాద్: తెలంగాణ, ఏపీ ఉద్యోగుల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం కొత్త నిర్ణయాలేమీ తీసుకోలేదని, రాష్ట్రం ఏర్పడిన ఏడాది రెండేండ్లలోనే ఉద్యోగుల పంపిణీ ప్రక్రియ దాదాపుగా కొలిక్కి వచ్చిందని అధికారవర్గాలు తెలిపాయి. ఉద్యోగుల విభజన సమయంలో ఆప్షన్లు, పోస్టుల లభ్యత ఆధారంగా తెలంగాణ స్థానికత ఉన్న ఉద్యోగులు కొందరు ఏపీకి, ఏపీ స్థానికత ఉన్న ఉద్యోగులు కొందరు తెలంగాణకు పంపిణీ అయ్యారు. వైద్య అవసరాలు, భార్యభర్తలు ఉద్యోగాల్లో ఉండటం, పిల్లల చదువులు, సొంత ఇల్లు ఉన్నాయనే కారణాలతో కొందరు ఉద్యోగులు ఈ పంపిణీ జరిగిన తీరుతో ఇబ్బందులు పడ్డారు. మానవీయ కోణంలో తమ బాధను అర్థం చేసుకోవాలని పలుమార్లు ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. అదే సమయంలో ఏపీకి వెళ్లేందుకు మాకు అవకాశం ఇవ్వాలని కోరుతూ తెలంగాణకు పంపిణీ అయిన 1369 మంది ఉద్యోగులు తమతంట తాముగా సమ్మతి తెలిపారు. వివిధ విభాగాల్లో పని చేస్తున్న 1369 మంది శాశ్వతంగా ఏపీకి వెళ్లేందుకు సమ్మతిస్తూ తమను ఏపీకి పంపించాలని అభ్యర్థనను అందించారు. 2021 సెప్టెంబర్లో తెలంగాణ ప్రభుత్వం ఆ ఉద్యోగుల వివరాలను సేకరించింది. వీరి అభ్యర్థన మేరకు ఏపీకి పంపించేందుకు మాకెలాంటి అభ్యంతరం లేదని నో ఆబ్జక్షన్ తెలియజేస్తూ 2021 సెప్టెంబర్లో తెలంగాణ ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది.