తెలంగాణలో గొర్రెల స్కామ్ దర్యాప్తులో ఏసీబీ అధికారులు మూడు రోజుల కస్టడీలోకి తీసుకున్న నిందితులను రెండో రోజు విచారణ జరిపారు.
విధాత, హైదరాబాద్ : తెలంగాణలో గొర్రెల స్కామ్ దర్యాప్తులో ఏసీబీ అధికారులు మూడు రోజుల కస్టడీలోకి తీసుకున్న నిందితులను రెండో రోజు విచారణ జరిపారు. మంగళవారం మాజీ పశు సంవర్ధక శాఖ ఎండీ రాంచందర్ నాయక్, ఓఎస్డీ కళ్యాణ్లను విచారించారు. మొదటిరోజు సోమవారం కస్టడీ విచారణలో రామచందర్, కల్యాణ్లు విచారణకు సహకరించలేదు. రెండో రోజు విచారణలో భాగంగా గొర్రెల స్కీమ్ యూనిట్ కాస్ట్ పెంపు, దళారుల ప్రమేయంపై ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. రామచందర్, కళ్యాణ్లను ఎదురెదురుగా కూర్చోబెట్టి విచారించారు. విచారణలో భాగంగా రాజకీయ నాయకుల పాత్ర, ఓఎస్డీ కళ్యాణ్ ఫైల్స్ తరలింపు, కాల్చివేత వీటన్నింటిపై ఏసీబీ అరా తీసింది. గొర్రెల స్కామ్లో ఇప్పటికే 10 మందిని నిందితులుగా గుర్తించి పలువురిని అరెస్ట్ చేశారు. గొర్రెల స్కామ్లో మొదట రూ. 2.10 కోట్లు దారి మళ్ళినట్టు గుర్తించారు. పశు సంవర్ధక శాఖ మాజీ డైరెక్టర్ రామ్ చందర్ నాయక్ , ఓఎస్డీ కళ్యాణ్ అరెస్ట్తో రూ.700 కోట్ల స్కామ్ జరిగినట్లు ఏసీబీ గుర్తించింది. దీనికి సంబంధించి కీలక ఆధారాలు సేకరించింది. కస్టడీ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కాంట్రాక్టర్ మోహినూద్దిన్ పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.