ఒకప్పుడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా లో వెలుగు వెలిగిన బీ ఆర్ ఎస్ పార్టీ నేడు గడ్డు పరిస్థితి ని ఎదుర్కొంటోంది
విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : ఒకప్పుడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా లో వెలుగు వెలిగిన బీ ఆర్ ఎస్ పార్టీ నేడు గడ్డు పరిస్థితి ని ఎదుర్కొంటోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పొందిన ఆ పార్టీ కి అప్పటి నుంచి ఆదరణ కరువైంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా లోని 14 స్థానాల్లో విజయడంకా మోగించిన ఆ పార్టీ 2023 ఎన్నికల్లో రెండు అసెంబ్లీ స్థానాలను మాత్రమే నిలబెట్టుకుంది.
ఇంతటి ఘోర పరిస్థితి వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. పార్టీ ఓటమి కి ఎమ్మెల్యే ల అవినీతి, భూ దందాలు, అహoకారం వంటివి ప్రజల్లో వ్యతిరేకత కు ప్రధాన కారణమైంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న ప్రజలు వారి పై ప్రజలు ఓటు ద్వారా తిరగబడ్డారు.అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం చెందిన బీ ఆర్ ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని చూస్తోంది.
ఇప్పటికీ మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి, నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి ప్రవీణ్ కుమార్ ను పోటీ లో నిలిపింది. వీరిద్దరి విజయం కోసం కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే లకు గులాబీ బాస్ దిశ నిర్దేశం చేశారు. కానీ ఇక్కడి మాజీ ఎమ్మెల్యే లు తమ అభ్యర్థుల గెలుపు కోసం ముందుకుకదలడం లేదు. టికెట్ పొందిన పార్లమెంట్ అభ్యర్థులు కూడా ఇప్పటివరకు ప్రచారం లో పాల్గొనక పోవడం తో ఆ పార్టీ శ్రేణులు అయోమయం లో ఉన్నారు. రోజు రోజుకు పార్టీ నుంచి వెళ్లిపోయే వారి సంఖ్య పెరగడం తో జిల్లా లో బీ ఆర్ ఎస్ కు దిక్కు దివాన లేకుండా పోతోంది.
రాజకీయ వన్నె తగ్గిన మన్నే
పాలమూరు పార్లమెంట్ నియోజకవర్గానికి ఐదేళ్లు బీ ఆర్ ఎస్ ఎంపీ గా ఉన్న మన్నే శ్రీనివాస్ రెడ్డి కి సొంత క్యాడర్ ను సమాకుర్చుకోవడం లో పూర్తి గా విఫలమయ్యారు.అప్పట్లో ఒక్క పాలమూరు మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెంట ఉండడం తప్పా ఎంపీ గా చేసిందేమి లేదనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఎంపీ గా ఉన్నన్ని రోజులు నియోజకవర్గా ల్లో తిరిగిన దాఖాలాలు లేవని చెప్పవచ్చు. మొక్కుబడి ఉన్న ఎంపీ గా ఈ ఐదేళ్లు పేరు తెచ్చుకున్నారు. మన్నే శ్రీనివాస్ రెడ్డి కి ప్రజా బలం లేకున్నా కెసిఆర్ చెరిస్మా విజయం పొంది ప్రజా సేవకు అంకితం కాలేక పోయారు.
గతంలో బీఆర్ఎస్ అంటే ప్రజల్లో ఉన్న అభిమానంతో మన్నే శ్రీనివాస్ రెడ్డి గట్టేక్కారు.2019 పార్లమెంట్ ఎన్నికల్లో 411402 ఓట్లు వచ్చి మొదటి స్థానంలో లో నిలిచారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మూడో స్థానానికి పరిమితం అయింది. కానీ గత అసెంబ్లీ ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీ భారీగా పుంజుకోవడం తో బీ ఆర్ ఎస్ పార్టీ అట్టడుగుకు వెళ్ళింది. ప్రస్తుతం బీ ఆర్ ఎస్ పార్టీ నుంచి పోటీ లో ఉన్న మన్నే శ్రీనివాస్ రెడ్డి వెన్నంటి నడిచే గులాబీ నేతలే కరువయ్యారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మన్నే ఒంటరి పోరాటం చెయ్యాల్సిన పరిస్థితి వచ్చింది.
కాంగ్రెస్, బీజేపీ కంటే ముందే టికెట్ సంపాదించుకున్న మన్నే నేటి వరకు పాలమూరు పార్లమెంట్ నియోజకవర్గం లో కనిపించలేదు. ఆయనకు పార్టీ క్యాడర్ కూడా సహకారం అందించక పోవడం మూలంగా గెలుపు ఆశలు సన్నగిల్లడడం తో ఆయన ప్రచారానికి రావడం లేదనే అభిప్రాయం ఆ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ అనుభవం లేకున్నా గత పార్లమెంట్ ఎన్నికల్లో కెసిఆర్ హవా తో విజయం సాధించిన ఆయన వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు కోసం ఎదురీడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ పార్టీ నియోజకవర్గం లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నా అందులో అందరూ కాంగ్రెస్ పార్టీ కి చెందిన ఎమ్మెల్యే ఉండడం తో బీ ఆర్ ఎస్ గెలుపు అసాధ్యమని తెలుస్తోంది.
గడ్డు పరిస్థితిలో ఆరెస్ ప్రవీణ్ కుమార్
ఎక్కడ దిక్కు లేని ఆమెకు అక్క మొగుడే దిక్కు అనే నానుడి అచ్చంగా ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ కు సరిపోతుంది. బహుజన సమాజ్ పార్టీ లో వెలుగు వెలిగి తెలంగాణ లో ఆ పార్టీ కి ప్రజా బలం తెచ్చే విధంగా విశ్వ ప్రయత్నం చేసిన ప్రవీణ్ కుమార్ చివరకు ఆ పార్టీ ని వదిలి గులాబీ పార్టీ చెంతకు చేరారు. బహుజనుల కోసం పోరాడుతాను అని ప్రకటించిన ప్రవీణ్ కుమార్ దొర పార్టీ చెంతకు చేరి బహుజనుల ను మోసం చేశారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. బీఆర్ఎస్ లో చేరిన వెంటనే నాగర్ కర్నూల్ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి పోటీ చేసే అవకాశం కెసిఆర్ కల్పించారు. ఎస్సి రిజర్వు స్థానం కావడం తో ఆయనకు టికెట్ లభించింది.
బహుజనులను నట్టేట ముంచి దొర చెంతన చేరిన ఆయనకు బహుజనుల ఓట్లు కూడా పడే అవకాశం కనిపించడం లేదు.2019 పార్టీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి బీ ఆర్ ఎస్ అభ్యర్థి పోతుగంటి రాములు విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఆయనకు 499672 ఓట్లు రావడం తో మొదటి స్థానం లో నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవికి 309924 ఓట్లు వచ్చి రెండో స్థానానికి పరిమితం అయ్యారు. ప్రస్తుతం వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీ రాములు బీ ఆర్ ఎస్ కు రాజీనామా చేసి బీజేపీ లో చేరారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి గా రాములు కుమారుడు పోతుగంటి భరత్ బరిలో ఉన్నారు. ఈ పార్లమెంట్ నియోజకవర్గం లో ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ అధికంగా ఉంది. బీ ఆర్ ఎస్ అభ్యర్థి గా పోటీ లో ఉన్న ప్రవీణ్ కుమార్ ఇప్పటి వరకు ప్రచారం లో పాల్గొనలేదు.
ఈ పార్లమెంట్ నియోజకవర్గం ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గా ల్లో గద్వాల, అలంపూర్ లో మాత్రమే బీ ఆర్ ఎస్ కు సంబంధించిన ఎమ్మెల్యే లు ఉన్నారు. వీరిద్దరూ కూడా ప్రవీణ్ కు సహకారం అందిస్తారో లేదో ప్రశ్నత్మాకంగా ఉంది. నాగర్ కర్నూల్, కల్వకుర్తి, అచ్చంపేట, వనపర్తి, కొల్లాపూర్ నియోజకవర్గా ల్లో కాంగ్రెస్ పార్టీ కి చెందిన ఎమ్మెల్యే ఉన్నారు. వీరంతా తమ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ఎవరికి వారు ప్రయత్నాలు ప్రారంభించారు.బీ ఆర్ ఎస్ అభ్యర్థి ప్రవీణ్ కుమార్కు ఆ పార్టీ క్యాడర్ సహకరించడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ పరిస్థితి భట్టి చూస్తే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా లోని రెండు పార్లమెంట్ స్థానాల్లో బీ ఆర్ ఎస్ పార్టీ గడ్డు పరిస్థితి ని ఎదుర్కొంటోంది.