విద్యుత్ కొనుగోళ్లు, భద్రాద్రి, యాదాద్రి ఫ్లాంట్ల నిర్మాణతో తెలంగాణ ప్రభుత్వానికి ఎక్కడా నష్టం జరగలేదని, ఆ విషయంలో ఏ విచారణకైనా సిద్ధమని రాష్ట్ర మాజీ మంత్రి జగదీష్రెడ్డి పునరుద్ఘాటించారు. ఆదివారం తెలంగాణభవన్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు
మాజీ విద్యుత్తు శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి స్పష్టీకరణ
విచారణకు సిద్ధమని పునరుద్ఘాటన
జస్టిస్ నరసింహారెడ్డి తన వ్యాఖ్యలతో విశ్వసనీయత కోల్పోయారు
వాదనలు వినకుండానే తీర్పునిచ్చారు
అందుకే కేసీఆర్ లేఖలో తప్పుకోమన్నారు
విధాత, హైదరాబాద్ : విద్యుత్ కొనుగోళ్లు, భద్రాద్రి, యాదాద్రి ఫ్లాంట్ల నిర్మాణతో తెలంగాణ ప్రభుత్వానికి ఎక్కడా నష్టం జరగలేదని, ఆ విషయంలో ఏ విచారణకైనా సిద్ధమని రాష్ట్ర మాజీ మంత్రి జగదీష్రెడ్డి పునరుద్ఘాటించారు. ఆదివారం తెలంగాణభవన్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆరెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్తు కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయని ప్రభుత్వం ఎంక్వయిరీ కమిషన్ వేసిందని, ఇప్పటికే ప్రభుత్వం లేవనెత్తిన సందేహాలకు అసెంబ్లీలో సమాధానం కూడా ఇచ్చామని, స్వేద పత్రాలు కూడా విడుదల చేశామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలోనూ కాంగ్రెస్, బీజేపీ వాళ్లు విద్యుత్తు కొనుగోళ్లు, ఫ్లాంట్ల నిర్మాణలపై లేవనెత్తిన అనుమానాలను మేం ఆనాడు నివృత్తి చేశామని గుర్తు చేశారు. ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి టీడీపీ సభ్యుడిగా ఆనాడు లేవనెత్తిన అంశాలను పరిగణనలోకి తీసుకున్నాకే తెలంగాణ విద్యుత్తు సంస్థల ప్రతిపాదనలకు ఈఆర్సీ ఆమోదముద్ర వేసిందని తెలిపారు. నాడు ఈఆర్సీ నిర్ణయాలపై అభ్యంతరాలు, ఆక్షేపణలుంటే ఎలక్ట్రిసిటీ అప్పిలేట్ ట్రైబ్యునల్కు లేదా సుప్రీంకోర్టుకు రేవంత్రెడ్డి ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్తు ఒప్పందాలపై విచారణకు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ వేసిందన్నారు. కమిషన్ సందేహాలకు కేసీఆర్ సమాధానం ఇచ్చారని, అదే సమయంలో కమిషన్ పాత్రపైన, వారి మాటలపైన అభ్యంతరం వ్యక్తం చేశారని స్పష్టం చేశారు.
పవర్ కమిషన్ వాదన వినకముందే తీర్పునిచ్చే తీరుతో వ్యవహారించిందని, కమిషన్ ఉద్దేశం వేరేలా ఉందని, అందుకే నరసింహారెడ్డికి అర్హత లేదని, కమిషన్ బాధ్యతల నుంచి తప్పుకోవాలని సూచించారని, అన్ని ఆధారాలు కేసీఆర్ చూపించారని జగదీశ్రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ లేఖలో పేర్కోన్న అంశాలు వందశాతం నిజమని, అది వారి హక్కు అని, మాజీ సీఎంగా ఆ విషయాలన్ని ప్రజలకు తెలిపారన్నారు. వివరణ ఇచ్చేందుకు ఈ నెల 30 వరకు అవకాశం ఇవ్వాలని కేసీఆర్ అడిగితే ఇవ్వలేదని, 15 లోపే వివరణ ఇవ్వాలన్నారని, అంతకుముందే 11వ తేదీన నరసింహారెడ్డి మీడియా ముందు కేసీఆర్పై పలు వ్యాఖ్యలు చేయడం విచారకరమన్నారు. జస్టిస్ నరసింహారెడ్డి అంటే మాకు గౌరవం ఉండేదని, ప్రభుత్వం మారిపోయక ఆయన కూడా మారిపోయారని జగదీశ్రెడ్డి వ్యాఖ్యానించారు. చీకట్లో ఉన్న తెలంగాణను వెలుగుల తెలంగాణగా మార్చిన కేసీఆర్పై ఆయన సానుభూతి ఉంటుందనుకున్నామని, కానీ ఆయన తీరు అలా లేదని జగదీశ్రెడ్డి ఆక్షేపించారు. విచారణ పూర్తి కాకముందే జడ్జిమెంట్ ఇచ్చినట్లుగా నరసింహారెడ్డి మీడియా ముందు వ్యాఖ్యలు చేశారని జగదీశ్రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. కమిషన్లను గతంలో అనేక ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయని, అనుమానాలున్నప్పుడు తప్పుకున్నారని, కొన్ని రద్దయ్యాయని గుర్తు చేశారు. నిజానికి ఈఆర్సీలకు వ్యతిరేకంగా విచారణ కమిషన్లు ఏర్పాటు చేయరాదని జస్టిస్ నరసింహారెడ్డికి ఎందుకు ప్రభుత్వానికి చెప్పలేదో తెలియడం లేదన్నారు. అయినప్పటికి మేం దానిపై మాట్లాడలేదని, విచారణకు సహకరిస్తునే వచ్చామన్నారు. అయితే నరసింహారెడ్డి కమిషన్ ముందుగానే విద్యుత్తు కొనుగోలు, ఫ్లాంట్ల నిర్మాణాలపై నష్టాలు వాటిల్లినట్లుగా చేసిన వ్యాఖ్యలతో ఆయన విచారణపై తమకు విశ్వాసం పోయిందన్నారు. అందుకే కమిషన్ బాధ్యతల నుంచి ఆయన తప్పుకోవాలని కేసీఆర్ కోరారని, ఆయన తప్పుకుంటారని మేం భావిస్తున్నామన్నారు.
తెలంగాణకు నష్టం చేసే పని కేసీఆర్ చేయరు
తెలంగాణకు నష్టం వాటిల్లే పనిని కేసీఆర్ ఎన్నడూ చేయరని జగదీశ్రెడ్డి స్పష్టంచేశారు. 800లోపు మెగావాట్ల ఫ్లాంటుకు సబ్ క్రిటికల్కు, అంతకు మించి సూపర్క్రిటికల్ టెక్నాలాజీని వాడుతారని, 2017తర్వాతా చేపట్టే ఫ్లాంట్లకు సూపర్ క్రిటికల్ వాడాలని కేంద్రం సూచించిందని, ఈ విషయాలన్ని విస్మరించి తమపై నిందలేస్తే ఎలా సహిస్తామని ప్రశ్నించారు. ప్రస్తుతం 90శాతం థర్మల్ పవర్ ఫ్లాంట్లు సబ్ క్రిటికల్ సాంకేతికతతోనే నడుస్తున్నాయన్న సంగతి ప్రజలు దృష్టిలో పెట్టుకోవాలని కోరారు. తెలంగాణ విద్యుత్తు అవసరాల కోసం ఆలస్యం కాకుండా అందుబాటులో ఉన్న సాంకేతికతో కేసీఆర్ భద్రాద్రి, యాదాద్రి ఫ్లాంట్ల నిర్మాణం చేపట్టారన్నారు. రెండు ప్రభుత్వాల మధ్య, ప్రభుత్వ రంగ సంస్థల మధ్య జరిగిన ఒప్పందాల్లో అవినీతికి ఆస్కారమే ఉండదని స్పష్టంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతోనే విద్యుత్తు కొనుగోళ్ల వ్యవహారంపై కమిషన్ వేసిందని విమర్శించారు. విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలకు, ట్రాన్స్మిషన్ లైన్ నిర్మాణం, థర్మల్ ఫ్లాంట్ల నిర్మాణాల పనులన్నింటిని కూడా మేం ప్రభుత్వ రంగ సంస్థలకే అప్పగించిన అంశం మరువరాదన్నారు.చత్తీస్గఢ్ నుంచి లైన్ పూర్తయ్యే సమయానికి అక్కడి ఫ్లాంట్ నిర్మాణం పూర్తవుతుందని ఒప్పందంలో ఉందన్నారు. ఆ సమయంలో ఇతర రాష్ట్రాలతో పోల్చితే చత్తీస్గఢ్లోనే రూ. 3.90పైసలకే కరెంటు దొరికిందన్న వాస్తవం ప్రజలు గ్రహించాలన్నారు. ఈ విషయాలన్ని గమనంలోకి తీసుకోకుండా రాజకీయ ఒత్తిళ్లు లేక మరేదోగాని జస్టిస్ నరసింహారెడ్డి గత ప్రభుత్వం తప్పుచేసినట్లుగా మాట్లాడటం అనుచితంగా ఉందని జగదీశ్రెడ్డి అగ్రహం వ్యక్తం చేశారు. భద్రాద్రి, యాదాద్రి నిర్మాణ సంస్థ బీహెచ్ఈఎల్ కూడా సూపర్ క్రిటికల్ సాంకేతికతో ఫ్లాంట్ను ఐదేళ్లలో పూర్తి చేస్తామని, దేశంలోని 17ఫ్లాంట్ల కంటే ముందే పూర్తి చేస్తామని చెప్పిందన్నారు.
ఎన్టీటీ కేసుతో యాదాద్రి ఫ్లాంటు నిర్మాణంలో ఆలస్యమైందని గుర్తు చేశారు. ఇవన్ని పరిగణలోకి తీసుకోకుండా జస్టిస్ నరసింహారెడ్డి కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటంతోనే కేసీఆర్ లేఖలో ఆక్షేపించారన్నారు. విద్యుత్తు ఒప్పందాల సమయంలో చత్తీస్గఢ్లో బీజేపీ ప్రభుత్వం ఉందని, తప్పులుంటే ఆ పార్టీ ప్రభుత్వం బయటపెట్టేదన్నారు. ఎంతసేపు కేసీఆర్ను బద్నాం చేయాలే ఆలోచన తప్ప కాంగ్రెస్ ప్రభుత్వానికి మరో పనిలేదన్నారు. యాదాద్రి థర్మల్ పవర్ ఫ్లాంట్ను వనరుల లభ్యత.. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా దామరచర్లలో పెట్టడం జరిగిందని జగదీశ్రెడ్డి స్పష్టం చేశారు. విజయవాడ, కడప థర్మల్ పవర్ ఫ్లాంట్ల కంటే దామరచర్ల దగ్గరలోనే ఉందన్నారు. అవగాహాన లేని వ్యక్తులే యాదాద్రి ప్లాంటును తప్పుబడుతారన్నారు. తెలంగాణ రాష్ట్ర ద్రోహులు, ఉద్యమద్రోహులు దొంగలంతా ఈ రోజు ప్రభుత్వంలోనే ఉన్నారని, వారంతా కలిసి కేసీఆర్ను అప్రతిష్ట పాలు చేసేందుకు కమిషన్ ముసుగులో బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అసలు కమిషన్ ద్వారా రాష్ట్ర ఖజానాకు నష్టం జరిగిందనా లేక అవినీతి జరిగిందనా అన్నదానిపై వారికే స్పష్టత లేదని జగదీశ్రెడ్డి మండిపడ్డారు.
మేం కమిషన్ ఎంక్వయిరీతో వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయని భావించామన్నారు. విద్యుత్తు ఒప్పందాలు, ఫ్లాంట్ల నిర్మాణాలతో కేంద్ర నిర్మాణ సంస్థలు, చత్తీస్ గఢ్ ప్రభుత్వాలు లాభపడ్డామని ఎందుకు చెప్పడం లేదని వారి అభిప్రాయాలు ఎందుకు తీసుకోవడం లేదని జగదీశ్రెడ్డి నిలదీశారు. కేసీఆర్ సహా ఈఆర్సీ చైర్మన్ను, చత్తీస్ ఘడ్ అప్పటి సీఎంను అందరిని పిలుచుకుని విచారించుకోవచ్చని మాకు అభ్యంతరం లేదని, అయితే కమిషన్ చైర్మన్పై విశ్వసనీయ లేనందునా విచారణర్హత కోల్పోయినందునా స్వచ్చందంగా తప్పుకోవాలని కోరామని, ప్రభుత్వాన్ని తప్పించమని డిమాండ్ చేయలేదన్నారు. కాంగ్రెస్, బీజేపీలు కలిసే కేసీఆర్పై కుట్ర చేస్తున్నారని, ఆ రెండు పార్టీలు కలిసి కేసీఆర్ను బీఆరెస్ను అణిచివేయాలని ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లోనూ వారి అదే రీతిలో వ్యవహారించారని విమర్శించారు. విద్యుత్తు కొనుగోళ్లు, ఫ్లాంట్ల నిర్మాణాలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి విమర్శలు, మాటలను రాష్ట్రంలో ఎవరు పట్టించుకోరని, ఆయన ఎప్పుడు ఎవరిని తిడుతారో ఆయనకే తెలియదని, గతంలో రేవంత్ను తిట్టారని ఇప్పుడు పొగుడుతున్నారని ఎద్దేవా చేశారు.