Thippiri Tirupathi alias Devji | నాలుగు దశాబ్దాల పాటు అడవుల్లో తలదాచుకున్న ఓ మాజీ మావోయిస్టు.. కొద్ది రోజుల క్రితమే జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. తను చదువుకున్న రోజుల్లో ఇంటర్ తెలుగు సబ్జెక్టులో ఫెయిలయ్యారు. అయితే ఆయన తన చదువును కొనసాగించాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో.. ఫెయిలైన తెలుగు పరీక్ష రాసేందుకు అనుమతివ్వాలని ఇంటర్ బోర్డు అధికారులను ఆశ్రయించారు. మరి ఆయనను ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు అనుమతిస్తారా..? లేదా..? అన్నది వేచి చూడాల్సిందే.
జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన మాజీ మావోయిస్టు అగ్ర నేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ (62) 1983లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఎంపీసీ చదివారు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ సబ్జెక్టుల్లో మంచి మార్కులు సాధించినప్పటికీ తెలుగు ఫెయిలయ్యారు. ఇప్పుడు మళ్లీ తనకు ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాసే అవకాశం కల్పించాలని కోరుతూ.. ఇంటర్ బోర్డును దేవ్జీ ఆశ్రయించారు.
అయితే దేవ్జీ డిగ్రీ చదువుకోవాలనే ఉద్దేశంతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని సంప్రదించారు. డిగ్రీలో ప్రవేశం పొందాలంటే తప్పనిసరిగా ఇంటర్ లేదా డిప్లొమా లేదా ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలని మాజీ మావోయిస్టులకు యూనివర్సిటీ అధికారులు సూచించారు. దీంతో ఆయన ఇంటర్ పరీక్ష మళ్లీ రాసేందుకు సిద్ధమయ్యారు.
సప్లిమెంటరీ పరీక్షలకు దేవ్జీని అనుమతించే విషయంపై ఇంటర్మీడియట్ బోర్డు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. రూ.3,000 ఆలస్య రుసుముతో సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మే 4తో ముగిసింది. ప్రత్యేక కేసుగా మాజీ మావోయిస్టుకు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది.
