G. Kishan Reddy | కాంగ్రెస్ వైఖరితో దేశం బలహీనం : కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి
ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపం మరోసారి బయటపడుతుందని, లోక్ సభ జరగకుండా అడ్డుపడటం..రాజ్యాంగం గురించి అబద్ధాలు ప్రచారం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యవహరించేందుకు సిద్ధమైందని, ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి వ్యాఖ్యానించారు

పార్లమెంటు వేదికగా కాంగ్రెస్ నిజస్వరూపం బట్టబయలు
సమవేశాలకు అడ్డుపడటం..రాజ్యాంగంపై అబద్ధాల ప్రచారం
విధాత, హైదరాబాద్ : ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపం మరోసారి బయటపడుతుందని, లోక్ సభ జరగకుండా అడ్డుపడటం..రాజ్యాంగం గురించి అబద్ధాలు ప్రచారం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యవహరించేందుకు సిద్ధమైందని, ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి వ్యాఖ్యానించారు. సోమాజిగూడ జయ గార్డెన్లో జరిగిన సికింద్రాబాద్ సెంట్రల్ జిల్లా విసృతస్థాయి కార్యకర్తల సమావేశంలో కిషన్రెడ్డి మాట్లాడారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 100 సీట్లు కూడా సాధించలేదని కాని, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయినట్లు ఊహాగానాల్లో తేలిపోయారని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఓడిపోయి సంబరాలు చేసుకున్న కాంగ్రెస్ పార్టీని దేశ రాజకీయాల్లో మొదటిసారిగా చూస్తున్నామన్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన అసహనంతో పార్లమెంటు సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగంపై ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అబద్ధాలు, తప్పుడు ఆరోపణలతో విషం చిమ్మారని విమర్శించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలలో ప్రచారం చేసుకోవచ్చని, కాని దేశ వ్యతిరేక శక్తులు, తీవ్రవాద శక్తులు చాపకింద నీరులా వ్యాపించి, ప్రధాని మోదీకి, బీజేపీకి వ్యతిరేకంగా అనేక కుతంత్రాలుఐ తప్పుడు ప్రచారాలు చేశాయన్నారు. దేశాన్ని చీల్చడం, దేశ వ్యతిరేక శక్తులకు ప్రోత్సాహం కల్పించడమే వారి ఉద్దేశమన్నారు. బీజేపీ మళ్లీ గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని, రిజర్వేషన్లు తొలగిస్తారని కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేసిందని గుర్తు చేశారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ను అనేకసార్లు అవమానించింది కాంగ్రెస్ పార్టీ అని, అంబేద్కర్ను ఎన్నికల్లో ఓడించాలని కుట్ర చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. జమ్ము కశ్మీర్ లో దేశ వ్యతిరేక శక్తులను పెంచిపోషించేందుకు వీలుగా ఉన్న ఆర్టికల్ 370 ని తొలగించి అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేసి, బడుగు, బలహీన వర్గాలకు, మహిళలకు హక్కులు కల్పించిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీదేని చెప్పారు. .సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం ఎన్నికల్లో నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలోకి దిగలేదని, అయితే బీజేపీపై మెజారిటీ సాధించిందని, అందుకు కారణం మజ్లిస్ పార్టీతో కుమ్మక్కవ్వడమేనని కిషన్ రెడ్డి పేర్కోన్నారు. మతోన్మాద శక్తులు ఏకమై బీజేపీని ఓడించే ప్రయత్నం చేశాయని విమర్శించారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ పాలనలో ఉగ్రవాదం, కుటుంబ పాలన, అవినీతి పెరిగిపోతుందని దేశ ప్రజలు గ్రహించినందునే ఆ పార్టీని మరోసారి అధికారానికి దూరంగా పెట్టారని తెలిపారు. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో అణచివేసిన ఘనత నరేంద్ర మోదీ ప్రభుత్వానిదేనన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో హైదరాబాద్ లో బాంబుపేలుళ్లతో ప్రజలు వణికిపోయిన సంగతి మరువరాదన్నారు. బొగ్గు కుంభకోణం, కామన్ వెల్త్ కుంభకోణం, 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం వంటి అనేక కుంభకోణాలతో సుమారు రూ. 12 లక్షల కోట్ల అవినీతికి పాల్పడిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకే దక్కిందని విమర్శించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం పదేళ్ల పాలనలో దేశంలో అభివృద్ధి పరంగా అనేక మార్పులొచ్చాయని, ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగిందన్నారు. నెహ్రూ గారి తర్వాత వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఘనత నరేంద్ర మోదీదేనని గుర్తు చేశారు. అధికారంతో, ఎన్నికలతో సంబంధం లేకుండా పార్టీ సంస్థాగతంగా ముందుకెళ్లే పార్టీ బీజేపీ మాత్రమేనన్నారు. సిద్ధాంతపరంగా, కార్యకర్తల ఆధారంగా, ప్రజాస్వామ్యయుతంగా నడుచుకునే పార్టీ బీజేపీ ఒక్కటేనన్నారు. రాష్ట్రంలో బీఆరెస్, కాంగ్రెస్లు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ ప్రజాతీర్పును అపహస్యం చేయడంలో ఒక్కటేనని నిరూపించుకున్నాయని విమర్శించారు. ఈ రెండు పార్టీల వ్యవహారశైలీలో తేడా లేదని, మజ్లీస్తో స్నేహం చేయడంలో కూడా బీఆరెస్, కాంగ్రెస్లు పోటీ పడుతున్నాయని దుయ్యబట్టారు.