ఇద్దరూ ఇద్దరే ఇద్దరి మధ్య గురుశిష్యుల సంబంధం ఉంది..ఒకరు బీజేపీ అభ్యర్థి అరూరి రమేష్, మరొకరు ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇద్దరూ ఇద్దరే పార్టీకి నష్టం చేకూర్చిన వారే అంటూ మాజీ చీఫ్ విప్, బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు
ఇద్దరూ పార్టీకి నష్టం చేశారు
కడియం ఎమ్మెల్యేగా రాజీనామా చేయ్
మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్
విధాత, వరంగల్ ప్రతినిధి: ఇద్దరూ ఇద్దరే ఇద్దరి మధ్య గురుశిష్యుల సంబంధం ఉంది..ఒకరు బీజేపీ అభ్యర్థి అరూరి రమేష్, మరొకరు ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇద్దరూ ఇద్దరే పార్టీకి నష్టం చేకూర్చిన వారే అంటూ మాజీ చీఫ్ విప్, బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ తీవ్రంగా విమర్శించారు. కడియం శ్రీహరి అహంకారం, – మోసం, – కుటిల రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ అంటూ విమర్శించారు. బ్రాండ్… బ్రాండ్ అంటావు కదా… నీకే బ్రాండ్ ఉంటే రాజీనామా చేసి గెలువు అంటూ శ్రీహరికి సవాల్ చేశారు. బిఆర్ఎస్ పార్టీ వరంగల్ పశ్చిమ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని శుక్రవారం ఆ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వినయ్ భాస్కర్ హాజరయ్యారు. ఈ సమావేశంలో మాజీ కుడా చైర్మన్ మర్రియాదవ రెడ్డి , వరంగల్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి డా. సుధీర్ కుమార్ , మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా వినయ్ మాట్లాడుతూ పార్టీకి ద్రోహం చేసిన వారిని ప్రజాక్షేత్రంలో ఎండగడుతాం, ద్రోహుల గురించి మాటాడుతాం అన్నారు. కడియం పచ్చని చేను కాడ దొబ్బితింటా.. వెచ్చగా పంట అనే తీరుగా ఉంటుందన్నారు. కాంగ్రెస్ ప్యాకేజీ ఇస్తే ఆ పార్టీలో చేరావు అంటూ విమర్శించారు. కడియం శ్రీహరి చరిత్ర నీచ నికృష్టమైన చరిత్ర అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ శాసనసభ్యులు తాటికొండ రాజయ్య తెలంగాణ మొత్తం వరంగల్ వైపు చూస్తోందన్నారు. శ్రీహరి ఇటు దళితులు, అటు పద్మశాలి, బైండ్ల జాతి ప్రజల ఆత్మ గౌరవం దెబ్బతిస్తుండని విమర్శించారు. దళిత ద్రోహి, దళిత దొర అంటూ ఆరోపించారు. సవాలు చేస్తున్న… దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికల్లో నిలబడు… నా పని శ్రీహరిని రాజకీయంగా సమాధి చేయడం… నేను నిండా మునిగి ఉన్నా… నన్ను ప్రజలల్లో పల్చన చేసిండు… ఇబ్బంది పెట్టిండు. ఇప్పుడు తేల్చుకుంటానని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి , జెడ్పీ చైర్మన్ డా. సుధీర్ కుమార్ మాట్లాడుతూ నేను పక్కా లోకల్ , మాదిగ సామాజికవర్గ బిడ్డను, ఉద్యమకారుడిని అన్నారు. కడియం రాజీనామా చేయాలి… ఇద్దరం బరిలో నిలుద్దామంటూ సవాల్ చేశారు. ఈ సమావేశంలో మాజీ కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్ రాజ్ యాదవ్, పశ్చిమ నియోజకవర్గ కో ఆర్డినేటర్లు జనార్దన్ గౌడ్, పులి రజినీకాంత్, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, మాజీ డివిజన్ అధ్యక్షులు, అనుబంధ సంఘాల సభ్యులు పాల్గొన్నారు.