family digital card । కుటుంబ డిజిటల్ కార్డులో మహిళే యజమాని.. ఒకే కార్డు బహుళ ప్రయోజనాలు..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్యామిలీ డిజిటల్ కార్డుల రూపకల్పనపై అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుత రేషన్, రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఐటీ, వ్యవసాయ, ఇతర సంక్షేమ పథకాల్లోని వివరాల ఆధారంగా కుటుంబాల నిర్ధారణ చేయాలని చెప్పారు. ఇతర రాష్ట్రాల కార్డుల రూపకల్పన, జారీలో ఉన్న మంచి అంశాలను స్వీకరించాలని, లోపాలను పరిహరించాలని చెప్పారు. బ్యాంకు ఖాతాలు, పాన్ కార్డుల వంటి అనవసర సమాచారం సేకరించాల్సిన పని లేదని తెలిపారు.

family digital card । కుటుంబ డిజిటల్ కార్డులో ఇంటి యజమానిగా మహిళనే గుర్తించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్రెడ్డి చెప్పారు. ఇతర కుటుంబ సభ్యుల పేర్లు, వారి వివరాలు కార్డు వెనుక ఉంచాలని సూచించారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డుల (ఎఫ్డీసీ) విషయంలో రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి శనివారం సమీక్షించారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై ఈ నెల 25వ తేదీ నుంచి 27 వ తేదీ వరకు రాజస్థాన్, హర్యానా, కర్ణాటక, మహారాష్ట్రలో పర్యటించిన అధికారులు.. తాము చేసిన అధ్యయనంపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. కార్డుల రూపకల్పలో సదరు రాష్ట్రాలు సేకరించిన వివరాలు, కార్డుల వలన కలిగే ప్రయోజనాలు, వాటిలో తాము గుర్తించిన లోపాలను వివరించారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్యామిలీ డిజిటల్ కార్డుల రూపకల్పనపై అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుత రేషన్, రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఐటీ, వ్యవసాయ, ఇతర సంక్షేమ పథకాల్లోని వివరాల ఆధారంగా కుటుంబాల నిర్ధారణ చేయాలని చెప్పారు. ఇతర రాష్ట్రాల కార్డుల రూపకల్పన, జారీలో ఉన్న మంచి అంశాలను స్వీకరించాలని, లోపాలను పరిహరించాలని చెప్పారు. బ్యాంకు ఖాతాలు, పాన్ కార్డుల వంటి అనవసర సమాచారం సేకరించాల్సిన పని లేదని తెలిపారు.
ప్రతి శాసనసభ నియోజకవర్గం పరిధిలో పైలట్గా రెండు ప్రాంతాల్లో…
ఫ్యామిలీ డిజిటల్ కార్డులకు సమాచార సేకరణ, వాటిల్లో ఏయే విషయాలు పొందుపర్చాలి? అప్డేట్కు సంబంధించిన వివరాలను నివేదిక రూపంలో ఆదివారం సాయంత్రంలోగా మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనరసింహలతో కూడిన క్యాబినెట్ సబ్కమిటీకి అందజేయాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉప సంఘం సూచనల మేరకు అందులో జత చేయాల్సిన, తొలగించాల్సిన అంశాలతో సమగ్ర జాబితా తయారు చేయాలని సూచించారు. అనంతరం రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాల్లో రెండు ప్రాంతాలను (ఒకటి గ్రామీణ, మరొక పట్టణ ప్రాంతం) పైలట్ ప్రాజెక్టు కోసం ఎంపిక చేయాలని సీఎం సూచించారు. (పూర్తిగా గ్రామీణ ప్రాంతాలున్న నియోజకవర్గాల్లో రెండు గ్రామాలు, పూర్తిగా పట్టణ/నగర ప్రాంతాలు ఉన్న నియోజకవర్గాల్లో రెండు వార్డులు/ డివిజన్లను ఎంపిక చేస్తారు.) కుటుంబాల నిర్థారణ, ఫ్యామిలీ డిజిటల్ కార్డుల వివరాలకు సంబంధించి అందుబాటులో ఉన్న డాటా ఆధారంగా అక్టోబరు మూడో తేదీ నుంచి పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో క్షేత్ర స్థాయి (డోర్ టూ డోర్) పరిశీలన చేయించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.
పైలట్ ప్రాజెక్టును పకడ్బందీగా చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇందుకు గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి నియోజకవర్గానికీ ఆర్డీవో స్థాయి అధికారిని నియమించాలని చెప్పారు. పట్టణ/నగర ప్రాంతాల్లో జోనల్ కమిషనర్ స్థాయి అధికారిని పర్యవేక్షణకు నియమించాలని అన్నారు. ప్రతి ఉమ్మడి జిల్లాకు ఇటీవల వరదల సమయంలో వేసిన సీనియర్ అధికారులను పర్యవేక్షకులుగా నియమించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎటువంటి లోపాలకు తావులేకుండా చూడాలని హెచ్చరించారు. సమీక్షలో మంత్రులు ఎన్ ఉత్తమ్ కుమార్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనరసింహ, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సీఎస్ శాంతి కుమారి, సీఎం ప్రిన్సిపల్ కార్యదర్శి వీ శేషాద్రి, సీఎం ప్రత్యేక కార్యదర్శులు అజిత్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, సీఎం కార్యదర్శులు సంగీత సత్యానారాయణ, మాణిక్ రాజ్, షానవాజ్ ఖాసీం, ఓఎస్డీ వేముల శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.