ఎవరో ఒకరు ఎపుడో అపుడు నడవరా ముందుకు అన్నట్లుగా ఓ మహిళ గుంతల పడిన రోడ్లపై నిరసనకు దిగి చైతన్యాన్ని చాటుకుంది.
విధాత : ఎవరో ఒకరు ఎపుడో అపుడు నడవరా ముందుకు అన్నట్లుగా ఓ మహిళ గుంతల పడిన రోడ్లపై నిరసనకు దిగి చైతన్యాన్ని చాటుకుంది. నాగోల్లోని ఆనంద్ నగర్లో గుంతలు పడిన రోడ్ల మరమ్మతుల పట్ల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ గురువారం రోడ్డు గుంతల్లో వర్షాలకు నిలిచిన నీటిలోకి దిగి ఓ మహిళ గురువారం నిరసన చేపట్టింది. మహిళకు ట్రాఫిక్ పోలీసులు నచ్చ చెప్పిన వినలేదు. జీహెచ్ఎంసీ అధికారుల నుండి స్పష్టమైన హామీ ఇస్తేనే నిరసన విరమిస్తానని భీష్మించుకుని కూర్చుంది. ఉప్పల్ నుంచి నాగోల్ వరకు 30గుంతలున్నాయని వాటి మరమ్మతులు జరిపించాలని డిమాండ్ చేశారు.
నిత్యం గుంతల దారుల్లో వాహనాలతో పడిపోయి పలువురు గాయాల పాలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె నిరసన వీడియో వైరల్గా మారింది. నాగోల్ రహదారి ఘటనపై స్పందించిన మేయర్ విజయలక్ష్మి అక్కడ తక్షణ మరమ్మతులకు ఆదేశించారు. వెట్మిక్స్తో సైట్లో మరమ్మతుల పని జరుగుతోందని, దానికి తోడు రీ కార్పెటింగ్ ప్రతిపాదనలు ప్రాసెస్లో ఉన్నాయని తెలిపారు. ప్యాచ్వర్క్ల వల్ల జరుగుతున్న అసౌకర్యాన్ని నివారించడానికి హుటాహుటిన మరమ్మతులు చేపట్టామని పేర్కోన్నారు. మరమ్మతులు జరుగుతున్న ఫోటోలను పోస్టు చేశారు.