KCR Health Bulletin | కేసీఆర్ ఆరోగ్యంగానే ఉన్నారు: యశోదా వైద్యులు
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) అనారోగ్య కారణాలతో బుధవారం సాయంత్రం హైదరాబాద్ సోమాజిగూడలోని యశోదా హాస్పిటల్లో చేరారు.

- సీజనల్ జ్వరంతో ఆసుపత్రిలో చేరిన మాజీ సిఎం
- వెంట కేటీఆర్, హరీశ్, భార్య శోభ
- బులెటిన్ విడుదల చేసిన యశోదా ఆసుపత్రి
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) అనారోగ్యకారణాలతో బుధవారం సాయంత్రం హైదరాబాద్ సోమాజిగూడలోని యశోదా హాస్పిటల్లో చేరారు. ఆయన సాధారణ నీరసం (General weakness)తో బాధపడుతుండటంతో కుటుంబ సభ్యులు అప్రమత్తమై వైద్యులను సంప్రదించారు. అనంతరం చికిత్స నిమిత్తం ఆయనను హాస్పిటల్కి తరలించారు.
వైద్యులు చేపట్టిన పరీక్షల్లో కేసీఆర్కు బ్లడ్ షుగర్ స్థాయిలు అత్యధికంగా ఉండటంతో పాటు, శరీరంలో సోడియం స్థాయి తక్కువగా ఉన్నట్లు వెల్లడించారు. అయితే, మిగతా అన్ని ముఖ్యమైన శరీర చిహ్నాలు (Vitals) సాధారణ స్థాయిల్లో ఉన్నాయని స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఆయనను ప్రత్యేక గదిలో సమగ్ర వైద్య పర్యవేక్షణలో ఉంచారు. మధుమేహం (డయాబెటిస్)ను నియంత్రించేందుకు, సోడియం స్థాయిని మెరుగుపర్చేందుకు అవసరమైన వైద్యప్రక్రియలను ప్రారంభించినట్లు వైద్యులు తెలిపారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యబృందం ప్రకటనలో స్పష్టంగా పేర్కొన్నారు.
తెలంగాణ రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న కేసీఆర్ ఆరోగ్యం విషయంలో కలవరం వద్దని వైద్యులు ప్రజలకు తెలియజేశారు. ఆయన పూర్తి స్థాయిలో కోలుకునేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు.