అధికారంలోకి వస్తే రాష్ట్ర గీతంగా జయ జయహే తెలంగాణ, TSను TGచేస్తాం: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
విధాత, హైదరాబాద్: కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వస్తే రాష్ట్ర గీతంగా జయ జయహే తెలంగాణ పాటను ప్రకటిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఉద్యమ సమయంలో అందెశ్రీ రాసిన జయజయహే తెలంగాణ పాటను తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటించాలిన అవసరముందన్నారు. అలాగే సబ్బండ వర్గాలను ప్రతిబింబించే తెలంగాణ తల్లి విగ్రహాన్నీ ఏర్పాటు చేయాల్సిన అవసరముందన్నారు. సెప్టెంబర్ 17కు సంబంధించి మూడు కీలక అంశాలను టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో ప్రతిపాదించారు. సెప్టెంబరు 17 నుంచి వచ్చే […]

విధాత, హైదరాబాద్: కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వస్తే రాష్ట్ర గీతంగా జయ జయహే తెలంగాణ పాటను ప్రకటిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఉద్యమ సమయంలో అందెశ్రీ రాసిన జయజయహే తెలంగాణ పాటను తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటించాలిన అవసరముందన్నారు. అలాగే సబ్బండ వర్గాలను ప్రతిబింబించే తెలంగాణ తల్లి విగ్రహాన్నీ ఏర్పాటు చేయాల్సిన అవసరముందన్నారు. సెప్టెంబర్ 17కు సంబంధించి మూడు కీలక అంశాలను టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో ప్రతిపాదించారు.
సెప్టెంబరు 17 నుంచి వచ్చే ఏడాది సెప్టెంబర్ 17 వరకు విలీన వజ్రోత్సవాలు నిర్వహించేందుకు సూచనలు చేయాల్సిందిగా పార్టీ నేతలను రేవంత్ కోరారు. సెప్టెంబర్ 17తో ఎలాంటి సంబంధం లేని బీజేపీ మత విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనాలను పొందాలని చూస్తోందని ఆయన విమర్శించారు. టీఆర్ఎస్ కు పర్యాయపదంగా వాహనాల రిజిస్ట్రేషన్ కోసం కేసీఆర్ టీఎస్ అని తీసుకొచ్చాడని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక దీన్ని సవరించి టీజీ పెడతామని ప్రతిపాదించారు.
కాంగ్రెస్ పేటెంట్ ను బీజేపీ, టీఆర్ఎస్ హైజాక్ చేస్తున్నాయని తెలిపారు. ఈ రెండు పార్టీలు తెలంగాణ సమాజాన్ని నిట్టనిలువునా చీల్చేందుకు ప్రయత్నిస్తున్నాయని, ఈ కుట్రలను తిప్పికొట్టాల్సిన బాధ్యత కాంగ్రెస్ పై ఉందన్నారు. చరిత్రను కనుమరుగు చేసి కేసీఆర్ తనకు అనుకూలంగా కొత్త చరిత్రను రాసుకుంటున్నాడని మండిపడ్డారు.
మునుగోడులో సమిష్టిగా
మునుగోడు ఉపఎన్నికల్లో క్షేత్ర స్థాయిలో పనిచేయడానికి 8 యూనిట్లుగా విభజించి నాయకులకు బాధ్యతలు నిర్ణయింమన్నారు రేవంత్. బూత్ కు ఇద్దరు చొప్పున 300 బూత్ లకు 150 మందిని నియమించాలని పార్టీ భావిస్తోందన్నారు. చిన్న,పెద్ద తేడా లేకుండా సెప్టెంబర్ 18 నుంచి అందరూ చిత్తశుద్ధితో కలిసి చేయాల్సిందేనని తెలిపారు. క్షేత్ర స్థాయిలో టీఆర్ఎస్, బీజేపీలను ఓడించాల్సిన అవసరాన్ని ప్రజలకు వివరించి కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేయాలని కోరారు.
15 రోజుల్లో మూడు సభలు
భారత్ జోడో యాత్ర దేశంలో ప్రకంపనలు సృష్టిస్తోందని రేవంత్ రెడ్డి అన్నారు. అక్టోబర్ 24న తెలంగాణలోకి రాహుల్ గాంధీ పాదయాత్ర ఎంటర్ అవుతుందని తెలిపారు. రాష్ట్రంలో 15 రోజుల పాటు 350 కిలోమీటర్ల మేర భారత్ జోడో పాదయాత్ర ఉంటుందన్నారు.
మక్తల్ వద్ద రాహుల్ పాదయాత్ర రాష్ట్రంలోకి ఎంటర్ అవుతుందన్న ఆయన.. అక్కడి నుంచి దేవరకద్ర, మహబూబ్ నగర్, జడ్చర్ల, షాద్నగర్, శంషాబాద్, తొండుపల్లి ఔటర్ రింగ్ రోడ్డు, పటాన్ చెరు, సంగారెడ్డి, జోగిపేట్, పెద్దశంకరంపల్లి, మద్నూర్ మీదుగా మహారాష్ట్రలోకి ఎంటర్ అవుతుందని తెలిపారు. ప్రతిరోజు ఒక పార్లమెంట్ నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు పాదయాత్రలో పాల్గొనేలా ప్రణాళికలు రచిస్తున్నామన్నారు.