Andhra Pradesh : ఏపీలో హై అలర్ట్.. రాష్ట్రంలో 60–70 మంది మావోయిస్టులు

ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టుల కదలికలు పెరగడంతో రాష్ట్రం మొత్తం హైఅలర్ట్‌లో ఉంది. పలు జిల్లాల్లో దాడులు, తనిఖీలు జరిగి పలువురు మావోయిస్టులు అదుపులోకి వచ్చారు.

Reported by: Tejaswini Nanna | ఆంధ్ర ప్రదేశ్ | Nov 18, 2025, 5:04 pm IST
Read Time: 3 mins
Andhra Pradesh : ఏపీలో హై అలర్ట్.. రాష్ట్రంలో 60–70 మంది మావోయిస్టులు

విధాత, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టుల కదలికలు ఎక్కువవుతున్న నేపథ్యంలో రాష్ట్రం మొత్తం హైఅలర్ట్‌లో ఉంది. ఇంటెలిజెన్స్‌ శాఖకు అందిన సమాచారం ప్రకారం సుమారు 60 నుంచి 70 మంది మావోయిస్టులు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో తలదాచుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు ఇప్పటికే పలు ప్రాంతాల్లో దాడులు, తనిఖీలు చేపట్టి అనేక మందిని అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు విజయవాడ పరిసర ప్రాంతాల్లో 32 మంది మావోయిస్టులు పట్టుబడ్డారు. ఏలూరులో మరో 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే, కాకినాడ జిల్లా కొప్పవరంలో ఇద్దరు మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు.

కాగా, పలు జిల్లాల్లో మావోయిస్టుల కదలికలు కనిపిస్తున్నందునా ఆయా జిల్లాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఎన్టీఆర్ జిల్లా, కృష్ణ, ఏలూరు, కాకినాడ, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో మావోయిస్టులు తలదాచుకున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఏపీ వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో భద్రతా బలగాలు, పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి సోదాలు చేపట్టారు. మావోయిస్టు అగ్రనేత హిడ్మా మృతి తర్వాత మావోయిస్టు దళాలు చెల్లాచెదురై ఆంధ్రప్రదేశ్ వైపు రావడానికి ప్రయత్నిస్తున్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేసి, సరిహద్దులకు అదనపు పోలీసు బలగాలను మోహరించినట్లు సమాచారం.