ప్రభుత్వంపై సోము విమర్శల వర్షం విధాత:వైకాపా ప్రభుత్వం వ్యతిరేకవిధానాలతో ప్రజలను దారుణంగా వంచించిందని భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు ఆరోపించారు. అధికారులు, దళారులు, మిల్లర్లు కలసి రైతులను ముంచేస్తు న్నారని అన్నారు. హిందూ ధర్మాన్ని, మతాన్ని అణచివస్తూ అన్యమతాలను ప్రోత్సహిస్తూ ఓటుబ్యాంకు రాజకీయాలకు పాల్పడుతుందని ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. ఇసుక, మద్యం సరఫరాలో ఈ ప్రభుత్వం అవినీతి పరాకాష్టకు చేరిందన్నారు. వైకాపా ప్రభుత్వ రెండేళ్ల పాలన పూర్తిగా గాడితప్పిందని, వ్యవస్థలు మొత్తం అవినీతి మయమైపోయాయని దుయ్యబట్టారు. ప్రజలకు డబ్బులు […]
ప్రభుత్వంపై సోము విమర్శల వర్షం
విధాత:వైకాపా ప్రభుత్వం వ్యతిరేకవిధానాలతో ప్రజలను దారుణంగా వంచించిందని భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు ఆరోపించారు. అధికారులు, దళారులు, మిల్లర్లు కలసి రైతులను ముంచేస్తు న్నారని అన్నారు. హిందూ ధర్మాన్ని, మతాన్ని అణచివస్తూ అన్యమతాలను ప్రోత్సహిస్తూ ఓటుబ్యాంకు రాజకీయాలకు పాల్పడుతుందని ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. ఇసుక, మద్యం సరఫరాలో ఈ ప్రభుత్వం అవినీతి పరాకాష్టకు చేరిందన్నారు. వైకాపా ప్రభుత్వ రెండేళ్ల పాలన పూర్తిగా గాడితప్పిందని, వ్యవస్థలు మొత్తం అవినీతి మయమైపోయాయని దుయ్యబట్టారు. ప్రజలకు డబ్బులు పంచడమే పాలనగా జగన్ భావిస్తున్నారని, అన్ని వ్యవస్థలు చక్కగా పనిచేయించాలనేది పాలనగా ఆయన తెలుసుకోవాలన్నారు. పట్టణాలకు నిధులివ్వకుండా ఏ రకంగా పన్నులు పెంచుతారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేకవిధానాలపై భాజపా ఉద్యమం చేస్తోందని, ఇది కొనసాగుతూనే ఉంటుందని చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లాలో సోమువీర్రాజు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఇలా మాట్లాడారు. హిందూ ధర్మం అణచివేత
జగన్మోహనరెడ్డి ప్రభుత్వం హిందువులను, హిందూ ధర్మాన్ని అణచివేస్తోందన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వందకు పైగా ఆలయాలను కూల్చివేసినా ఒక్కరినీ కూడా పట్టుకోవడం చేతకాక పిచ్చోళ్లు చేశారని వారిపై నెట్టేసిందన్నారు. కాని అన్యమతాలను ప్రోత్సహిస్తూ సంతుష్టీకరణ కార్యక్రమాలు చేస్తూ ఓటుబ్యాంకు రాజకీయాలకు పాల్పడుతుంది. ప్రభుత్వ ధనంతో చర్చిల నిర్మాణం, ఫాస్టర్లకు జీతాలు ఇవ్వడాన్ని భాజపా వ్యతిరేకిస్తుంది. ప్రభుత్వ ధనంతో చర్చిలు నిర్మించడం దేశంలో ఎక్కడా లేదు. ఇది రాజ్యాంగానికి వ్యతిరేకం. అలాగే ఫాస్టర్లకు ఏ ప్రాతిపదికపై ప్రభుత్వం జీతాలిస్తోంది. ఫాస్టర్ల ఎంపికపై ప్రభుత్వం వద్ద ఏదైనా విధివిధానాలున్నాయా? హిందు వులను ఊచకోతకోసిన టిప్పుసుల్తాను విగ్రహాన్ని ప్రొద్దుటూరులో ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. విగ్రహం ఏర్పాటు వెనుక ప్రభుత్వ ప్రోత్సాహం కూడా ఉందన్నారు. దీనిని భాజపా వ్యతిరేకిస్తుందన్నారు. విగ్రహం ఏర్పాటులో ఉన్న శ్రద్ధ అంతర్వేది రథం తగలబెట్టిన నిందితులు, రామతీర్ధంలో విగ్రహం ధ్వంసం చేసిన నిందితులు, అమ్మవారి రథంలో బొమ్మలు ఎత్తు కు పోయిన వారిని పట్టుకోవడంలో ఎందుకు చూపించలేదని అన్నారు. తిరుపతి నుంచి రామతీర్ధం వరకు చేపట్టనున్న భాజపా హిందూ చైతన్య యాత్రకు అనుమతి ఎందుకివ్వలేదని ప్రశ్నించారు.
రైతులను ముంచేశారు.
వైకాపా ప్రభుత్వం రైతులను నట్టేట మంచేసిందని సోమువీర్రాజు మండిపడ్డారు. రైతుల నుంచి మద్దకు ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో ఈ ప్రభుత్వం విఫలమైందన్నారు. సేకరించిన సగం ధాన్యానికి కూడా చెల్లింపులు జరగక రైతులు ఇబ్బందిపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం రవాణాకోసం తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచే రూ.250 కోట్లు ఖర్చులు రాస్తారని, అవి రైతులకు ఇవ్వకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు, వ్యవసాయ, పౌరసరసరా అధికారులు పంచేసు కుంటున్నారని ఆరోపించారు. ఇలాంటి ఆదాయం కోసమే డిప్యుటేషన్పై వచ్చిన పౌరసరఫరా శాఖల్లో ఎండీలు నాలుగైదేళ్లుగా ఇక్కడ తిష్టవేసుకుని కూర్చుంటున్నారని అన్నారు. రైతుల నుంచి మద్దతు ధరకు ధాన్యం కొనుగోలుచేయకపోవడం వల్ల తక్కువ ధరకు మిల్లర్లకు అమ్మేసుకుంటు న్నారని అన్నారు. రైతు అయిదేళ్లలో రూ.15 వేల కోట్ల చొప్పున నష్టపోతున్నారని చెప్పారు. మిల్లర్లు కిలో బియ్యానికి పది రూపాయలు పెంచి అమ్మడం వల్ల రాష్ట్రంలోని ప్రజలు అయిదేళ్లలో రూ. 75 వేల కోట్లు నష్టపోతున్నారని చెప్పారు. ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం సకాలంలో కొనాలని, డబ్బు వెంటనే ఇవ్వాలని, రవాణా ఖర్చులు, కొత్త సంచులు ఇవ్వాలని
డిమాండ్ చేశారు. ఇసుక, మద్యం సరఫరాతో లూటీ:
ఇసుక సరఫరా, మద్యం అమ్మకాల్లో ప్రభుత్వం ప్రజలను లూటీ చేస్తోందన్నారు. లారీ ఇసుకను రూ.10 వేలు అమ్మాల్సి ఉండగా పది వేలు అదనంగా అమ్ముతున్నారని విమర్శించారు. ప్రాంతాని కో రేటు ఉందన్నారు. ఇసుక సరఫరాపై భాజపా గతంలో ఉద్యమం చేసిందని, మరల ఉద్యమం చేస్తామన్నారు. అలాగే మద్యాన్ని సొంతగా తయారుచేసి దానికో పేర్లు పెట్టి కాపుసారాలా అమ్మేస్తు న్నారని విమర్శించారు. పాత బ్రాండ్లను బ్లాక్ అమ్ముతున్నారని ఇదో పెద్ద కుంభకోణంగా అభివర్ణిం చారు. పట్టణాల్లో మౌలికసదుపాయాలకు కేంద్రం నిధులిస్తోందని, దమ్ముంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం నిధులిచ్చిందో చెప్పాలన్నారు. రహదారులు, డ్రెయిన్లు, మంచినీటిసరఫరా, పారిశుధ్యం అన్నిటికీ కేంద్రమే నిధులిస్తుదని అన్నారు. పట్టణాలకు ఏం చెయ్యకుండా పన్నులు ఎందుకు పెంచుతున్నారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతరం పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
సోము వీర్రాజు వెంట భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శరణాల మాలతీరాణి, భాజపా ఏలూరు పార్లమెంటు జిల్లా అధ్యక్షులు, జ్యోతి కృష్ణ సుధాకర్ నాయకులు పాల్గొన్నారు.