ఆత్మహత్యలు సమస్యలకు పరిష్కారం కానే కాదువిధాత:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ వైపు నిరుద్యోగత పెరిగిపోవడం, మరోవైపు ప్రభుత్వం సర్కారు కొలువు భర్తీ చేయకపోవడంతో నిరుద్యోగులు నిరుత్సాహంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ఇది చాలా తప్పుడు నిర్ణయమని, అంతా కలిసి ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేలా పోరాడదామని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపునిచ్చారు. బీఈడీ పూర్తిచేసి టీచర్ ఉద్యోగం సాధించాలనే కలలు కల్లలయ్యాయనే మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడిన కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం గోపాలనగరంకి చెందిన […]
ఆత్మహత్యలు సమస్యలకు పరిష్కారం కానే కాదు
విధాత:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ వైపు నిరుద్యోగత పెరిగిపోవడం, మరోవైపు ప్రభుత్వం సర్కారు కొలువు భర్తీ చేయకపోవడంతో నిరుద్యోగులు నిరుత్సాహంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ఇది చాలా తప్పుడు నిర్ణయమని, అంతా కలిసి ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేలా పోరాడదామని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపునిచ్చారు. బీఈడీ పూర్తిచేసి టీచర్ ఉద్యోగం సాధించాలనే కలలు కల్లలయ్యాయనే మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడిన కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం గోపాలనగరంకి చెందిన నాగేంద్రప్రసాద్ కుటుంబానికి సంతాపం తెలుపుతూ నారా లోకేష్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జగన్రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టి రెండేళ్లయినా, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ 2 లక్షల 30 వేల ఉద్యోగాల భర్తీకి ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే రోజుకొక నిరుద్యోగి బలవన్మరణం వార్త వినాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతీ ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, ప్రతీ ఏటా డిఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని ప్రతీ సభలో పేర్కొన్న జగన్రెడ్డి గద్దెనెక్కాక జనవరి1న జాబ్ క్యాలెండర్ విడుదలా లేదు, ఒక్క డిఎస్సీకి నోటిఫికేషన్ ఇవ్వకపోవడం విద్యార్థుల్ని దారుణంగా మోసగించారని ఆరోపించారు. దక్షిణాది రాష్ట్రాలలో నిరుద్యోగిత రేటులో ఏపీలో మొదటి స్థానంలో వుందని, దేశంలో నాల్గవ స్థానంలో వుండటం రాష్ట్రంలో పరిస్థితులకు అద్దం పడుతోందన్నారు. వైసీపీ రెండేళ్ల పాలనలో 300 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, సర్కారు నిరంకుశ ధోరణితో ఇలా ఎంత మందిని నిరుద్యోగుల్ని బలి తీసుకుంటుందని ప్రశ్నించారు. నిరుద్యోగులు కూడా నిరాశతో కుంగిపోకుండా, మీ హక్కు అయిన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చేవరకూ ప్రభుత్వంపై కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై పోరాడేందుకు తాను ముందుంటానని హామీ ఇచ్చారు. ఎన్ని కష్టాలున్నా ఆత్మహత్య పరిష్కారం కాదని, తల్లిదండ్రుల ఆశలు వమ్ము చేసి బలవన్మరణాలకు పాల్పడటం నిరుద్యోగులు మానుకోవాలని పిలుపునిచ్చారు. మొత్తం ప్రభుత్వ ఖాళీలను భర్తీచేసేందుకు కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, ప్రతీ ఏటా డిఎస్సీ భర్తీ చేయాలనే నిరుద్యోగుల డిమాండ్లతో అంతా కలిసి పోరాడదామని పిలుపునిచ్చారు.