అమరావతి : విశాఖ చేపల రేవు నుంచి వేటకు వెళ్లి సముద్రంలో బోటుబోల్తా పడటంతో ఏడుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. వారిలో ఒకరిని కోస్ట్ గార్డ్ సిబ్బంది, రెస్క్యూటీమ్ కాపాడింది. నేవీ హెలికాప్టర్ల ద్వారా రెస్క్యూ ఆపరేషన్ విస్తృతం చేశారు. సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులతో మాట్లాడి సహాయక చర్యలపై తగిన ఆదేశాలు జారీ చేశారు. విశాఖ తీరానికి ఆరు నాటికన్ మైళ్ల దూరంలో సముద్ర జలాల్లో బోటు తిరగబడటంతో ప్రమాదం జరిగింది.
విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాం గ్రామానికి చెందిన చిన్న, గరగయ్య, అప్పలరాజు, కారె చిన్నయ్య, సీతోడు, విశాఖ జిల్లా భీమిలి మండలం పెదనాగమయ్యపాలేనికి చెందిన బండియ్య, విశాఖకు చెందిన చిన్న అమ్మోరులు బోటులో ఈనెల 1వ తేదీన విశాఖ చేపలరేవు నుంచి బోటులో చేపల వేటకు వెళ్లారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారిపోవడంతో.. కుటుంబ సభ్యులకు తాము 4వ తేదీ మధ్యాహ్నానికి తీరానికి వచ్చేస్తామని చెప్పారు.
శనివారం సాయంత్రం వరకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆరుగురికి ఫోన్లు చేయగా ఏవీ పనిచేయలేదు. దీంతో తమవారికి ఏమైందోనని తీవ్ర ఆందోళనలో గురయ్యారు.సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు గాలింపు చేపట్టి బోటు యజమాని కారె చిన్నయ్యను సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చారు. మిగిలిన వారి కోసం గాలింపు కొనసాగుతోంది.
