ANDRAPRADESH | గ్రామ, వార్డు సచివాలయాల పేర్లను మార్పు? ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల ప్రక్షాళన చేసేందుకు ఏపీలోని సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల పేర్లను మార్చాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

విధాత, హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల ప్రక్షాళన చేసేందుకు ఏపీలోని సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల పేర్లను మార్చాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సచివాలయాల పేరును గ్రామ సంక్షేమ కార్యాలయాలుగా మార్పు చేయాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అక్కడ సంక్షేమ శాఖకు చెందిన వెల్ఫేర్ అసిస్టెంట్లను డీడీవోగా ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. గ్రామ సంక్షేమ కార్యాలయంలో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల గుర్తింపు, జాబితాను తయారీని ఎటువంటి రాజకీయం ఒత్తిడి లేకుండా చేయాలనేది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. కొత్త పేరు (గ్రామ సంక్షేమ కార్యాలయం)తో అక్టోబరు 2 (గాంధీ జయంతి) నుంచి గ్రామ సంక్షేమ కార్యాలయాలు పనిచేసేలా విధి విధానాలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతి గ్రామ సంక్షేమ కార్యాలయంలో ఐదుగురు సిబ్బందిని నియమించనున్నట్లు తెలుస్తోంది. అటు గ్రామ/వార్డు సచివాలయాల వ్యవస్థ ప్రక్షాళనను వీఆర్వో సంఘాలు స్వాగతించాయి. ప్రధానంగా సచివాలయ ఉద్యోగుల పనితీరు, బాధ్యతలు, స్థానిక సమస్యలు, పరిష్కార చర్యలపై పూర్తిస్థాయిలో సమీక్షించి నిర్ణయాలు తీసుకోవాలి అంటున్నారు. సచివాలయాల ఏర్పాటులో గత ప్రభుత్వం తీసుకున్న అసంబద్ధ నిర్ణయాలతో ఉద్యోగులకు పదోన్నతులు లేకుండా పోయిందన్న అసంతృప్తి వారిలో నెలకొంది.