అమరావతి :ఓ వైపు లోక్ సభలో అమరావతి రాజధాని చట్టబద్దత బిల్లు ప్రవేశపెట్టి అమోదించే క్రమంలో..ఇంకోవైపు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్.జగన్ ఏపీ రాజధాని అంశంలో ప్లాన్ బీ పేరుతో సరికొత్త ప్రతిపాదన చేశారు. మచిలీపట్నం – విజయవాడ – గుంటూరు 110 కిలోమీటర్ల నేషనల్ హైవే ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించి..దానికి ఆ ప్రాంతాల పేర్లు కలిసేలా.. MA-VI-GUN(మవిగన్) అని పేరు పెట్టండని ప్రభుత్వానికి సూచించారు. చంద్రబాబు అమరావతిలో పెడతానని చెప్పిన రూ.2 లక్షల కోట్లలో 10% పెట్టినా అది మంచి ఎకనామిక్ కారిడార్ అవుతుంది అని జగన్ స్పష్టం చేశారు. ఒకప్పుడు వరల్డ్ క్లాస్ సిటీ అని చంద్రబాబు ఊదరగొట్టారని.. ఇప్పుడు మున్సిపాలిటీగా మిగిలిపోతుందని ఎందుకు అంటున్నారని ప్రశ్నించారు.
రూ.2లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారో..?
రాజధాని అమరావతి పేరుతో మొదట తీసుకున్న 50 వేల ఎకరాలకే దిక్కు లేదు అని, రైతులకు ఇచ్చిన హామీల మాటే మరిచిపోయారని..ఇందులో రోడ్లు, కరెంటు, వాటర్, డ్రైనేజీ కల్పనకే ఖర్చు రూ.లక్ష కోట్లు అవసరమన్నారని జగన్ విమర్శించారు. ఇప్పుడు సడన్గా మరో 50 వేల ఎకరాలకు భూసేకరణ ఎందుకు పెంచారు? మాస్టర్ ప్లాన్ను ఎందుకు మారుస్తున్నారు? అని ప్రశ్నించారు. దీంతో అదనంగా మరో రూ.లక్ష కోట్లు పెరిగింది అన్నారు. రూ.2లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు..ఈ డబ్బు పెట్టి రాజధాని నిర్మాణాన్ని ఎన్ని సంవత్సరాలలో కడుతారని ? ఎన్ని దశాబ్దాలు పడుతుంది? అని జగన్ నిలదీశారు. లక్ష ఎకరాల అమరావతిలో ఇంతవరకూ కట్టింది ఎంత?
నిజంగా అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అయ్యిందా? రూ.2 లక్షల కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి? అని జగన్ నిలదీశారు. చంద్రబాబు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలకు దిక్కులేదని, ఉద్యోగస్తులకు రూ.36 వేల కోట్ల బకాయిలు ఉన్నాయని, మేం పెట్టిన సంక్షేమ పథకాలు ఆగిపోయాయని, ఈ పరిస్థితుల్లో చంద్రబాబు లక్ష ఎకరాల అమరావతికి రూ.2 లక్షల కోట్లు ఎప్పుడు పెట్టగలుగుతాడని నిలదీశారు.
అసెంబ్లీ తీర్మానం.. చంద్రబాబు డ్రామా
భవిష్యత్తులో కూడా రాజధానిని ఎవరు మార్చకుండా చట్టం చేస్తున్నామని చెప్పిన చంద్రబాబుకు చట్టసభలు చట్టాలను సవరణ చేసే సంగతి కూడా తెలియదా అని జగన్ ప్రశ్నించారు. చట్ట సభలు ఏ చట్టాన్నైనా తయారు చేయగలవు, సవరించగలవు అన్న సంగతి ఈ రోజుల్లో అందరికి తెలిసిందేనని జగన్ గుర్తు చేశారు. అదే పద్దతిలో ప్రస్తుత అమరావతి చట్టసభ తీర్మానం కూడా భవిష్యత్తులో మార్చవచ్చన్నారు. కేవలం రాజధాని పేరుతో సాగిస్తున్న అవినీతి నుంచి డైవర్షన్ చేయడానికే అమరావతి రాజధానికి చట్టబద్దత తీర్మానం పేరుతో చంద్రబాబు అసెంబ్లీలో డ్రామా నడిపించారని జగన్ విమర్శించారు. చంద్రబాబు అవినీతి బాగోతాన్ని కౌన్సిల్లో బయటపెడతారని రాజధాని తీర్మానంలో కౌన్సిల్ ను భాగస్వామ్యం చేయలేదని ఆరోపించారు. రాజధానిపై అసెంబ్లీలో తీర్మానం అవసరం లేదని, స్వయంగా మంత్రి పార్థసారథి గతంలో చెప్పారని జగన్ గుర్తు చేశారు.
రాజధాని పేరిట దోపిడీని ప్రశ్నిస్తే..వ్యతిరేకమా?
అసెంబ్లీ, హైకోర్టు భవనాల్లోనూ చంద్రబాబు హైలెవల్ కరప్షన్ కు పాల్పడుతున్నారని, అమరావతిలో రోడ్లైనా, మురుగునీటి కాల్వలైనా, సీవరేజీ ప్లాంట్లైనా..కొండవాటి వరద మళ్లింపు పనులైనా…ఎందులోనైనా అవినీతే జరుగుతుందని జగన్ ఆరోపించారు. కేవలం సచివాలయం టవర్లు, హైకోర్టు, అసెంబ్లీ డిజైన్లకోసమే రూ.401 కోట్లు పెడుతున్నారు అని, ఫ్లైఓవర్ కోసమే కిలోమీటర్కు రూ.170 కోట్లు పెడుతున్నారని, మా హయాంలో విజయవాడలో బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్కు కి.మీ.రూ.35 కోట్లు పెట్టారు అని, మిగిలిపోయిన సిక్స్ లేన్ రోడ్డుకు అమరావతిలో రూ.53 కోట్లు పెడుతున్నారు అని వెల్లడించారు. నేషనల్ హైవేల్లో సిక్స్ లేన్ కోసం సగటు ఖర్చు రూ.20 కోట్లు మాత్రమే అని గుర్తు చేశారు. చంద్రబాబు దోపిడీని ప్రశ్నిస్తే..అమరావతికి వ్యతిరేకం అని ఎదురుదాడి చేస్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడని జగన్ దుయ్యబట్టారు. 2018 లో రాజధాని ప్రాంతంలో ఏ పనులు, ఎవరు చేశారో.. 2024లో టెండర్లు రద్దు చేసిన తర్వాత కూడా మళ్లీ అవే కంపెనీలకు పనులు అప్పగించారని, అనూహ్యంగా రేట్లు పెంచి, మరో వైపున టెండర్లు రింగ్ చేసి భారీ గూడుపుఠాణీకి పాల్పడ్డారని జగన్ విమర్శించారు.
ఇవి కూడా చదవండి :
Amaravati Capital Bill : రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్సభ ఆమోదం
Gold and Silver Price Today | పెరిగిన బంగారం, వెండి ధరలు
