అయోధ్య అంశాన్ని ఓట్లు దండుకునేందుకు ఉపయోగించుకోవాలని జాతీయ స్థాయిలోనే బిజెపి నిర్ణయించింది. ఆమెకు రాష్ట్రంలోనూ అయోధ్యనామం జపించేందుకు బిజెపి సిద్ధమైంది.
విధాత బ్యూరో, కరీంనగర్: కరీంనగర్ లోక్సభ సభ్యుడు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ మరోసారి గెలుపు కోసం అయోధ్య రామాస్త్రాన్ని బయటకు తీశారు. తన లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ఓటర్లందరికీ అయోధ్య రాముని చిత్రపటాన్ని అందించడానికి సిద్ధమయ్యారు. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవ సందర్భంగా రామ జన్మభూమి ట్రస్ట్ ఇంటింటికీ తలంబ్రాలు అందించిన చందంగానే, ఆయన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. శాసనసభ ఎన్నికల ఘట్టం ముగిసిన మరునాటి నుండే లోక్సభ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన సంజయ్.. ఈ ఎన్నికల్లో మళ్లీ గెలిచేందుకు అన్ని ప్రయత్నాలూ చేసుకుంటున్నారు.
దాదాపు 40 వేల మంది ముఖ్య కార్యకర్తలతో కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో సమావేశ నిర్వహణకు ఏర్పాట్లు చేసుకొని, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను ఆ కార్యక్రమానికి సంజయ్ ఆహ్వానించారు. అయితే బీహార్ పరిణామాల నేపథ్యంలో అమిత్ షా పర్యటన రద్దు కావడంతో, అది కాస్తా వాయిదా పడింది. దీంతో పార్లమెంట్ పరిధిలోని శాసనసభ నియోజకవర్గాలలో విస్తృతంగా పర్యటిస్తున్న సంజయ్.. హిందూ ఓటు బ్యాంకును మరింత సుస్థిరపరిచేందుకు ప్రతి ఇంటికి రామున్ని చేరవేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రతి ఇంటిలో అయోధ్య రామయ్య కొలువు దీరేలా ఆయన చిత్రపటాలను తయారు చేయించేందుకు బండి సంజయ్ సిద్ధమయ్యారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో 5 లక్షలకు పైగా కుటుంబాలు ఉండగా.. అందులో 4 లక్షలకుపైగా కుటుంబాలు హిందూవులని వెల్లడి కావడంతో వారందరికీ అయోధ్య రామయ్య చిత్ర పటాన్ని పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా 4 లక్షల 21 వేల 11 వందల అయోధ్య రాముడి చిత్ర పటాలను తయారు చేయించే పనిలో సంజయ్ నిమగ్నమయ్యారు.
పల్లెకు పోదాం ఛలో.. ఛలో…
మరోవైపు బీజేపీ జాతీయ నాయకత్వం పిలుపు మేరకు పల్లెకు పోదాం(గావ్ ఛలో) కార్యక్రమంలో భాగంగా బండి సంజయ్ కుమార్ మంగళవారం హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని రంగాపూర్ గ్రామంలో పర్యటిస్తున్నారు. స్థానికులతో మమేకం కానున్నారు. పార్టీకి సంబంధించి సామాన్య కార్యకర్త నివాసంలో స్థానికులతో కలిసి భోజనం చేయనున్నారు. దీంతోపాటు ఆ గ్రామంలోనే రాత్రి బస చేయనున్నారు. ఈ సందర్భంగా నరేంద్రమోదీ ప్రభుత్వం ఆ గ్రామానికి ఏం చేసిందనే అంశంతోపాటు గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను, వాటి పరిష్కార మార్గాలపై స్థానికులతో చర్చించనున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న బీజేపీ కార్యకర్తలు, హిందుత్వ వాదులంతా రంగాపూర్ గ్రామంలో శ్రీరామ చంద్రుడిని తలిచి కొలిచే ప్రతి ఇంటికి అయోధ్య రాముడి చిత్ర పటాన్ని అందించే పనిలో నిమగ్నమవడం గమనార్హం.