ప్రారంభించేవారు, పట్టించుకునేవారు లేక బీఆరెస్ కరీంగనగర్ కార్యాలయం కోతుల నిలయంగా మారింది.
– సాక్షాత్తు బీఆర్ఎస్ కార్యాలయం
– ఆక్రమించేసిన వానర మూకలు
విధాత బ్యూరో, కరీంనగర్: ఇదేదో కోతుల సంరక్షణ కేంద్రం అనుకుంటే తప్పులో కాలేసినట్టే! ఉద్యమ గడ్డపై బీఆర్ఎస్ ముచ్చటపడి కట్టుకున్న కార్యాలయం. ప్రస్తుతం ఈ కార్యాలయం కోతులకు ఆవాసంగా మారిపోయింది. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం చించోలి గ్రామంలో కోతుల బెడద నివారణ కోసం గత ప్రభుత్వం కోతుల సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేసింది. తాము మాత్రం ఏం తక్కువ అనుకున్నాయో, ఏమో కానీ, కరీంనగర్ బీఆర్ఎస్ కార్యాలయాన్ని కోతులు ఆక్రమించేశాయి. ప్రతి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని నాటి ప్రభుత్వం సంకల్పించింది. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా అన్నట్టు ప్రతి జిల్లా కేంద్రంలో ప్రముఖ స్థలాల్లో పార్టీ కార్యాలయాల కోసం నామమాత్రపు ధరలకు స్థలాల కేటాయింపు జరిపింది. కరీంనగర్ నుండి వేములవాడ వెళ్లే ప్రధాన రహదారిలో పద్మా నగర్ సమీపంలో బీఆర్ఎస్ కార్యాలయ నిర్మాణం చేపట్టి ఎన్నికల నాటికి ముందే పూర్తి చేశారు. దీంతోపాటే నిర్మాణ పనులు చేపట్టి పూర్తిచేసిన ఆర్అండ్ బీ గెస్ట్ హౌస్, ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాలను ప్రారంభించిన అప్పటి మంత్రి బీఆర్ఎస్ కార్యాలయం జోలికి మాత్రం వెళ్లలేదు. దీంతో ఆ కార్యాలయం ప్రారంభోత్సవానికి నోచుకోకుండా పోయింది. నాటి మంత్రి, వివిధ హోదాలలో అధికార దర్పం వెలగబెట్టిన నేతలు, చివరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యాలయం వైపు కన్నెత్తి చూడకపోవడంతో ఆ భవనం ఓ అనాథలా మిగిలిపోయింది. కరీంనగర్ పట్టణంలో బీఆర్ఎస్ కు సొంత కార్యాలయం ఉన్న విషయం కూడా మరుగున పడిపోయింది. జిల్లాకు చెందిన పార్టీ నేతలు ఆ కార్యాలయం వైపు చూడకపోవడానికి వాస్తు దోషమే ప్రధాన కారణంగా చెప్పుకుంటున్నారు. వాస్తుకు అనుగుణంగా దానిని కూల్చివేసి తిరిగి నిర్మించాలని అనుకున్నప్పటికీ కాలం కలిసి రాక, ప్రభుత్వం అధికారంలోకి రాకుండా పోయింది.
స్థానికులకు తప్పిన కోతుల బెడద
ఇక కరీంనగర్ లో కోతుల స్వైర విహారం చెప్పనలవి కాదు. ‘జనాల్లోని కోతులను, వనాల్లోకి పంపిస్తాం’ అనే నినాదం కూడా బీఆర్ఎస్ నేతలు ఇచ్చిందే! ఎలాగూ ఆ హామీ వారు నిలబెట్టుకోరని, బహుశా ఇక్కడి కోతులకు కూడా తెలిసిపోయింది. దీంతో అవి దర్జాగా గులాబీ పార్టీ కార్యాలయాన్ని ఆక్రమించేశాయి. బీఆర్ఎస్ కార్యాలయాన్ని నిర్మించి ఏడాదికి పైగా కావస్తున్నా, దాని ఆలనా పాలన పట్టించుకున్న వారు లేకపోవడంతో, ఆ పరిసరాలన్నీ చెట్లతో నిండిపోయాయి. భవనం కూడా శిథిలావస్థకు చేరుకుంటోంది. దీంతో వందలాది కోతులు ఆ భవనంలోనే తిష్ట వేశాయి. ఆ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు ఈ రకంగానైనా తమకు కోతుల బెడద తప్పినందుకు సంతోషిస్తున్నారు. బీఆర్ఎస్ కార్యాలయాన్ని కూడా కోతుల సంరక్షణ కేంద్రంగా మారిస్తే పోలా అంటూ చతురోక్తులు విసురుకుంటున్నారు.