గద్వాల జిల్లా ఎర్రవల్లి చౌరస్తా సమీపంలో ఒక ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఒక మహిళ చనిపోయారు.
జోగులాంబ గద్వాల్ : గద్వాల జిల్లాలోని ఎర్రవల్లి చౌరస్తాలో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. జోగులాంబ గద్వాల జిల్లా 44 వ జాతీయ రహదారి బీచుపల్లి వద్ద శనివారం తెల్లవారు జామున ప్రైవేట్ బస్ బోల్తా పడి మంటల్లో చిక్కుకుంది. ఓ ప్రయివేటు బస్సులో మంటలు చెలరేగి, మహిళ సజీవదహనం అయింది. మరో నలుగురు ప్రయాణికులు గాయపడగా, చికిత్స నిమిత్తం కర్నూల్ ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి చిత్తూరుకు వెళుతున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్ బీచుపల్లి పోలీస్ బెటాలియన్ పెట్రోల్ బంక్ వద్ద శనివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో అదుపు తప్పి బోల్తాపడింది.
ఈ ప్రమాదంలో షార్ట్ సర్య్కూట్తో బస్సుకు మంటలు అంటుకున్నాయి. అందులో నుంచి ప్రయాణికులు హహకారాలు చేస్తూ బయటకు వచ్చారు. ఓ ప్రయాణికురాలి చేయి బస్ కు ఇరుక్కుపోవడంతో మంటల్లో సజీవదహనం కాగా నలుగురు తీవ్రంగా గాయపడగా 20 మంది స్వల్పంగా గాయపడ్డారు వారిని హుటాహుటిన గద్వాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి వారు డయల్ 100కు ఫోన్ చేయడంతో పోలీసులు వేగంగా స్పందించారు. ఘటనస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.ప్రమాద సంఘటన ప్రాంతానికి గద్వాల జడ్పీ చైర్ పర్సన్ సరిత చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. రెండు నిమిషాల్లో బస్సు పూర్తిగా దగ్ధమైంది. బస్సు ప్రమాదానికి గురైన సమయంలో అందులో 35 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. మృతురాలిని మాలతి(45)గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.