అనుకున్న‌దొక్క‌టి, అయింది ఒక్క‌టి.. ఇంగ్లండ్ ధాటికి భార‌త్ కుదేలు..!.

అనుకున్న‌దొక్క‌టి, అయింది ఒక్క‌టి.. ఇంగ్లండ్ ధాటికి భార‌త్ కుదేలు..!.

ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో టీమిండియా ఊహించ‌ని విధంగా ఓటమి పాలైంది. గెలుస్తుంద‌నుకున్న మ్యాచ్‌లో భార‌త్ దారుణ‌మైన ప‌రాజ‌యం చ‌వి చూసింది. హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో చెత్త బ్యాటింగ్‌తో టీమిండియా 28 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఆసాంతం ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ వైఫల్యం భారత్ కొంపముంచింది.ఈ విజయంతో ఇంగ్లిష్‌ జట్టు సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో టెస్టు ఫిబ్రవరి 2 నుంచి విశాఖపట్నంలో జరగనుంది. అయితే తొలి టెస్ట్‌లో భార‌త్ 231 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగగా, ఇంగ్లండ్ జట్టు ఆ టీంని 202 పరుగులకు క‌ట్టడి చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ 39 పరుగులు చేశాడు. రవిచంద్రన్ అశ్విన్, కేఎస్ భరత్ చెరో 28 పరుగులతో ఇన్నింగ్స్ ఆడారు. ఇంగ్లండ్‌ తరపున అరంగేట్రం చేసిన టామ్ హార్ట్లీ 7 వికెట్లు పడగొట్టాడు.

టెస్ట్‌ల్లో ఉప్పల్ మైదానం వేదికగా భారత్‌కు ఇదే తొలి పరాజయం. ఈ ఓటమితో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. 231 పరుగుల సాధారణ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. మరోసారి దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించిన యశస్వి జైస్వాల్(15), రోహిత్ శర్మ(39) తమ జోరును కొనసాగించలేకపోయారు. హార్ట్‌లీ బౌలింగ్‌లో జైస్వాల్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన శుభ్‌మన్ గిల్‌ను హార్ట్‌లీ సిల్వర్ డక్ ఔట్ చేశాడు. దాంతో భారత్ 2 బంతుల వ్యవధిలోనే రెండు వికెట్లు కోల్పోగా, అదే జోరులో రోహిత్ శర్మ(39)ను వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. ఆ కొద్ది సేపటికే అక్షర్ పటేల్(17)‌ను రిటర్న్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు.

అనంతరం కేఎల్ రాహుల్(22)ను జోరూట్ వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. ఈ పరిస్థితుల్లో జట్టును ఆదుకుంటాడని భావించిన జడేజా(2) బెన్ స్టోక్స్ సూపర్ త్రోకు రనౌట్‌గా వెనుదిరగ్గా.. శ్రేయస్ అయ్యర్(13) తన వైఫల్యాన్ని కొనసాగించాడు.ఈ క్ర‌మంలో టీమిండియా 119 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో కేఎస్ భరత్, అశ్విన్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేసిన ఏం ప్ర‌యోజ‌నం లేకుండా పోయింది. ఇక భారత ఓటమి ఖాయమని అంతా అనుకున్న స‌మ‌యంలో బుమ్రా, సిరాజ్ అసాధారణ బ్యాటింగ్‌తో ఇంగ్లండ్ బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచారు. కాని ఆఖరి వికెట్‌కు 25 పరుగులు జోడించి ఆశలు రేకెత్తించారు. కానీ సిరాజ్ స్టంపౌటవ్వడంతో ఇక భార‌త్ ఓటమి ఖ‌రారైపోయింది.