దేవుడా.. నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు అంటూ ఎమోషనల్ కామెంట్స్

శిఖర్ ధావన్.. ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఒకప్పుడు ఓపెనర్గా టీమిండియాకి ఎన్నో అద్భుతాలు అందించాడు. ఐసీసీ టోర్నమెంట్స్లో పరుగులు వరద పారించి రికార్డులు సృష్టించాడు.అయితే ధావన్ కెరీర్ ఇప్పుడు సజావుగా లేదు. టీమిండియాకు అతడు దూరమై దాదాపు ఏడాది దాటింది. దీంతో అతడి బ్యాటింగ్ మెరుపులను తన అభిమానులు ఐపీఎల్లోనే చూడగలుగుతున్నాం తప్ప, ఐసీసీ మ్యాచ్లలో చూడలేకపోతున్నాం. ప్రస్తుతం అతను సీజన్ 17 ఐపీఎల్ కోసం సన్నద్ధమవుతున్నాడు. అయితే ధావన్కి ఇప్పుడు కెరీర్ పరంగానే కాకుండా వ్యక్తి గతంగాను అనేక సమస్యలు ఎదురవుతున్నాయి.
చూడగలుగుతున్నారు. మార్చిలో ప్రారంభమయ్యే ఐపీఎల్ కోసం ప్రస్తుతం అతడు సన్నద్ధమవుతున్నాడు. తన భార్య అయేషా ముఖర్జీతో విడిపోయిన అనంతరం తన కొడుకు జొరావర్ను మిస్ అవుతూ ఎంతో మానసిక ఆవేదన చెందుతున్నాడు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో తన బాధని పంచుకున్నాడు శిఖర్.. దేవుడు కరుణిస్తే తన కొడుకు జొరావర్తో కలిసి ఉండాలని తెలియజేశాడు. ‘నా కొడుకుని చూడడం కోసం ఆస్ట్రేలియా వెళ్లాను. కానీ కొన్ని గంటలు మాత్రమే అతడితో ఉండే అవకాశం దక్కింది. జొరావర్తో కాసేపు సరదాగా సమయం గడపాలని, లాలించాలని, గుండెలకు హత్తుకోవాలని నాకు ఎంతగానో ఉంది. నాన్నగా నా ప్రేమను పంచాలని కూడా ఉంది. కానీ, గత కొన్ని నెలలుగా అతడితో మాట్లాడే అవకాశం నాకు ఒక్కసారి కూడా రాలేదు.
నేను ఇప్పుడు సానుకూలంగానే ఉన్నాను. నా కుమారుడిని అమితంగా ప్రేమిస్తున్నా . అతనికి నిత్యం మెసేజ్లు పంపిస్తున్నాను. అతడు చూస్తున్నాడో లేదో తెలియదు కాని, తండ్రిగా నా వంతు ప్రయత్నిస్తున్నాను. జొరావర్ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. దేవుడు కరుణిస్తే మా అబ్బాయితో కలిసి జీవిస్తాను” అని ధావన్ వెల్లడించాడు. కొద్ది రోజుల క్రితం శిఖర్ ధావన్ తనను ఆయేషా మానసికంగా వేధిస్తోందని విడాకులు మంజూరు చేయాలని కోర్టు మెట్లెక్కాడు… కోర్టు విడాకులు మంజూరు చేసింది. కాని తన కుమారుడి శాశ్వత కస్టడీని కోరిన ధావన్ అభ్యర్థనను మాత్రం న్యాయస్థానం తిరస్కరించింది. అయితే కేవలం ఫోన్లో మాట్లాడవచ్చని, సెలవుల సమయంలో కుమారుడితో కలిసి భారత్లో నివసించవచ్చని పేర్కొంది. అందుకు అయేషా సహకరించాలని కూడా కోరింది.