సాగర్ ప్రాజెక్టు వద్ద పాత పరిస్థితిని పునరుద్ధరించండి..
నాగార్జునసాగర్ వద్ద పాత పద్ధతిని పునరుద్ధరించాలని కోరుతూ కేఆర్బీఎం చైర్మన్కు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది.

- కేఆర్ఎంబీ చైర్మన్కు తెలంగాణ ఈఎన్సీ లేఖ
విధాత : నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద నవంబర్ 28వ తేదీకి ముందున్న పరిస్థితిని పునరుద్ధరించాలని తెలంగాణ ప్రభుత్వం మరోమారు కోరింది. ఈ మేరకు తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) చైర్మన్కు లేఖ రాశారు. డ్యాం వద్ద సీఆర్పీఎఫ్ బలగాల మోహరింపునకు తెలంగాణ ప్రభుత్వం సహకరించిందని పేర్కొంటూ.. ఏపీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకునేలా తక్షణమే స్పందించాలని కేఆర్ఎంబీని లేఖలో కోరారు.
కేఆర్ఎంబీ చైర్మన్, కేంద్ర హోంశాఖ కార్యదర్శుల సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు సాగర్ ప్రాజెక్టును తెలంగాణనే నిర్వహించాలని ఈ లేఖలో పేర్కొన్నారు. అందుకు నవంబర్ 28వ తేదీకి ముందున్న పరిస్థితిని పునరుద్ధరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కృష్ణా బోర్డుకు విజ్ఞప్తి చేశారు.
సాగర్ డ్యాం వద్ద కేంద్ర బలగాలు మోహరించాయి. డ్యాంపైకి 13వ గేటు వద్దకు చేరుకుని ఇరువైపు రెండు రాష్ట్రాల పోలీసులు ఏర్పాటు చేసిన కంచెను తొలగించారు. అయితే తెలంగాణ మాత్రం డ్యాం నిర్వాహణను పూర్తిగా గతంలో మాదిరిగా తమకే అప్పగించాలని కోరుతున్నది.