NPS Vatsalya | పిల్లల కోసం సరికొత్త పెన్షన్ ప్లాన్..! కొంచెం పొదుపు చేస్తే కోట్లలో నిధి..!!
NPS Vatsalya | పిల్లల చదువులకు, వారి పెళ్లిళ్లకు తల్లిదండ్రులు డబ్బును జమ చేస్తుంటారు. ఏదో రూపంలో మొత్తంగా డబ్బును పొదుపు చేస్తారు. ఇక చదువులు, పెళ్లిళ్లు అయిపోయాక తమ బాధ్యత అయిపోయిందని ఊపిరి పీల్చుకుంటారు. కానీ పిల్లల వృద్ధాప్య జీవితం గురించి ఏ మాత్రం ఆలోచించరు. అందుకోసమే కేంద్ర ప్రభుత్వం ఎన్పీఎస్ వాత్సల్య( NPS Vatsalya ) అనే సరికొత్త పెన్షన్ పథకాన్ని అందుబాటులోకి తీసుకోచ్చింది. ఈ పథకం వివరాలను సమగ్రంగా తెలుసుకుందాం.
NPS Vatsalya | చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్ పట్ల ఎంతో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. పిల్లలను క్రమశిక్షణతో పెంచి.. ఉన్నత చదువులు చదివించాలని ఆరాటపడుతుంటారు. చదువులు అయిపోయాక మంచి పెళ్లి సంబంధం తీసుకొచ్చి ఓ ఇంటి వాడిని చేయాలని కలలు కంటుంటారు. ఇందుకోసం కొంత ధనం కూడబెడుతుంటారు. పొదుపు చేసిన డబ్బుతో చదువుకు, పెళ్లిళ్లకు వినియోగిస్తారు. కానీ పిల్లల వృద్ధాప్యం గురించి మాత్రం ఏ పేరెంట్ కూడా ఆలోచించరు. కాబట్టి.. పిల్లలు వృద్ధాప్యంలో కూడా ఆర్థికంగా ఎవరిపై ఆధారపడకుండా ఉండాలంటే.. ఇప్పట్నుంచే ఒక ఆర్థిక క్రమశిక్షణ అవసరం. ఇందుకు ఎంతో కొంత డబ్బు పొదుపు చేసుకోవడం ఉత్తమం. దీని కోసమే కేంద్ర ప్రభుత్వం ఎన్పీఎస్ వాత్సల్య (NPS Vatsalya) పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. మరి ఈ పథకానికి ఎవరు అర్హులు..? పెట్టుబడి వివరాలు ఏంటి..? అనే విషయాలను ఈ కథనంలో సమగ్రంగా తెలుసుకుందాం.
ఎన్పీఎస్ వాత్సల్య పథకానికి ఎవరు అర్హులు..?
18 ఏళ్ల లోపు కలిగిన భారతీయుడు ఎవరైనా అర్హులే.
ప్రవాస భారతీయులు (NRIs), ఓసీఐ (OCI) కార్డు ఉన్నవారు కూడా తమ పిల్లల పేరు మీద అకౌంట్ తెరవవచ్చు.
ఈ అకౌంట్లో పూర్తి లబ్ధిదారుడు కేవలం మైనర్ మాత్రమే అయి ఉండాలి.
పెట్టుబడి ఎంత పెట్టాలి..?
ఎన్పీఎస్ వాత్సల్య పథకం కింద పెట్టుబడి ఎంత పెట్టాలంటే.. అది పూర్తిగా వ్యక్తిగత స్తోమతపై ఆధారపడి ఉంటుంది. ఏడాదికి కనీసం రూ. 250 నుంచి ఎంతైనా పెట్టుబడి పెట్టొచ్చు. ముఖ్యంగా మూడు రకాల పెట్టుబడి మార్గాలు ఉన్నాయి.
1. ఈక్విటీ (Equity): 50% నుంచి 75% వరకు (దీనివల్ల లాభాలు ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది).
2. ప్రభుత్వ సెక్యూరిటీలు: 15% నుంచి 20% వరకు.
3. కార్పొరేట్ డెట్: 10% నుంచి 30% వరకు.
మరి డబ్బులు ఎప్పుడు డ్రా చేసుకోవచ్చు..?
ఈ పథకంలో డబ్బు జమ చేస్తున్నాం.. కానీ ఎప్పుడు డ్రా చేసుకోవాలనే సందేహం ప్రతి ఒక్కరికి ఉంటుంది. పెన్షన్ కోసమని దాచిపెడుతున్న డబ్బును ముందే కూడా డ్రా చేసుకోవచ్చు. మైనర్లకు 18 ఏళ్లు నిండక ముందే కొన్ని అత్యవసర పరిస్థితుల్లో డబ్బు విత్ డ్రా చేసుకోవచ్చు.
1. ఉన్నత చదువుల కోసం
2. తీవ్రమైన అనారోగ్య సమస్యల చికిత్స కోసం.
3. 75 శాతం కంటే ఎక్కువ అంగవైకల్యం సంభవించినప్పుడు.
18 ఏళ్లు నిండిన తర్వాత ఏం జరుగుతుంది?
పిల్లలకి మెజారిటీ (18 ఏళ్లు) వచ్చిన తర్వాత, అకౌంట్ ఆటోమేటిక్గా రెగ్యులర్ ఎన్పీఎస్ (NPS All Citizen Model) కి మారుతుంది. అప్పుడు వారు.. మొత్తం నిధిలో 80 శాతం నగదుగా విత్ డ్రా చేసుకుని, మిగిలిన 20 శాతంతో పెన్షన్ ప్లాన్ తీసుకోవచ్చు. ఒకవేళ మొత్తం నిధి రూ. 8 లక్షల కంటే తక్కువ ఉంటే మొత్తం నగదును విత్ డ్రా చేసుకోవచ్చు.
ఆన్లైన్లో అకౌంట్ ఎలా తెరవాలి?
1. ముందుగా అధికారిక eNPS పోర్టల్ సందర్శించి ‘NPS Vatsalya’ సెక్షన్పై క్లిక్ చేయండి.
2. తల్లిదండ్రుల ఆధార్ లేదా డిజీలాకర్ ద్వారా కేవైసీ (KYC) పూర్తి చేయండి.
3. పిల్లల పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలు నమోదు చేసి, కావాల్సిన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయండి.
4. కనీసం రూ. 1,000 తొలి పెట్టుబడిగా చెల్లించి రిజిస్ట్రేషన్ పూర్తి చేయండి.
5. సక్సెస్ఫుల్ సబ్మిషన్ తర్వాత, పిల్లల పేరు మీద ఒక ప్రత్యేక PRAN నంబర్ జనరేట్ అవుతుంది.
తక్కువ పెట్టుబడితో ఎక్కువ కాలం పొదుపు చేయడం వల్ల ‘పవర్ ఆఫ్ కాంపౌండింగ్’ ద్వారా మీ పిల్లల అకౌంట్లో భారీ నిధి జమ అవుతుంది. అందుకే వారి భవిష్యత్తుకు భద్రతనిచ్చే ఎన్పీఎస్ వాత్సల్య (NPS Vatsalya) అకౌంట్ ను ఇప్పుడే ప్రారంభించడం ఉత్తమ నిర్ణయం.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram