విధాత, హైదరాబాద్ : అంతర్జాతీయ పరిణామాలు దేశీయంగా బంగారం ధరలపై విపరీతమైన ప్రభావం చూపుతున్నాయి. గత కొన్ని రోజులుగా నిరంతరం పెరుగుతూ సామాన్యులను భయపెడుతున్న బంగారం ధరలు బుధవారం రోజున కాస్త శాంతించి కొనుగోలుదారులకు ఊరటనిచ్చాయి. ప్రపంచ స్థాయిలో మార్కెట్ పరిస్థితులు, దేశీయ మార్కెట్లో నెలకొన్న స్థానిక పరిస్థితుల కారణంగా ధరలు స్థిరంగా నిలిచాయి. దేశీయ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,63,750 వద్ధ కొనసాగుతుండగా, 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,50,100 వద్ధ నిలిచింది.
పశ్చిమాసియాలో రెండు ప్రధాన దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా మారడంతో అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాయి. దౌత్యపరమైన ఆందోళనలు, యుద్ధ భయాల కారణంగా స్టాక్ మార్కెట్లతో పాటు అంతర్జాతీయ పసిడి మార్కెట్ కూడా గత కొన్ని రోజులుగా తీవ్రమైన ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. అయితే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు, సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు వంటి పరిణామాల మధ్య పసిడి, వెండి ధరలు పరుగు పెడుతున్నాయి. తాత్కాలికంగా బంగారం ధరలు శాంతించినా మళ్లీ పుంజుకోవడం ఖాయం అని చెబుతున్నారు.
