BHIM: ‘పైసోం కా కదర్’ ! పాత యాప్.. కొత్త ప్రచారం

ముంబై: భారత్ సొంత చెల్లింపుల యాప్గా భీమ్ తన స్థానాన్ని బలోపేతం చేసుకోవడానికి ‘పైసోం కా కదర్’ పేరుతో కొత్త ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) అనుబంధ సంస్థ ఎన్పీసీఐ భీమ్ సర్వీసెస్ లిమిటెడ్ (ఎన్బీఎస్ఎల్) ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. చెల్లింపు విధానాలు మారుతున్నప్పటికీ, భారతీయులు నగదు విషయంలో నమ్మకానికి ఇచ్చే విలువను ఈ ప్రచారం ప్రతిబింబిస్తుంది. రోజువారీ చెల్లింపు అవసరాలను సులభంగా తీర్చే ఆధునిక యాప్గా భీమ్ స్థిరపడేలా ఈ కార్యక్రమం ఉంటుందని తెలిపింది.
టిల్ట్ బ్రాండ్ సొల్యూషన్స్ ఈ క్యాంపెయిన్ను ఐదు బ్రాండ్ ఫిలిమ్లతో రూపొందించింది. ఈ ఫిలిమ్లు భీమ్ యాప్ వినియోగ సౌలభ్యం, నమ్మకం, భద్రత, కస్టమర్ ప్రాధాన్యత, సమగ్రత వంటి కీలక విలువలను హైలైట్ చేస్తాయి. అందరికీ అందుబాటులో ఉండేలా 9 భారతీయ భాషల్లో ఈ ఫిలిమ్లు విడుదలవుతాయి. ఈ క్యాంపెయిన్ భీమ్ 3.0ని పరిచయం చేస్తుంది. ఇది 15 కంటే ఎక్కువ భారతీయ భాషల్లో అందుబాటులో ఉంటుంది. ఇంటర్నెట్ సౌకర్యం తక్కువ ఉన్న ప్రాంతాల్లో కూడా ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది.
ఖర్చు విభజన, కుటుంబ మోడ్, వ్యయ విశ్లేషణ, రిమైండర్లు వంటి ఆర్థిక నిర్వహణ సాధనాలు ఇందులో అందుబాటులో ఉన్నాయి. “సాంకేతికతను స్వీకరించడంలో నమ్మకం కీలకం. గ్రామీణ భారతంలో డిజిటల్ చెల్లింపులు సౌలభ్యంతో పాటు నమ్మకంపై ఆధారపడతాయి. భీమ్ 3.0తో మేము సరళమైన, సురక్షితమైన అనుభవాన్ని మెరుగుపరిచాం. ‘పైసోం కా కదర్’ నగదు రూపం మారినా, విలువలు మారవని గుర్తుచేస్తుంది,” అని ఎన్బీఎస్ఎల్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రాహుల్ హాండా తెలిపారు.