RBI dividend | కేంద్రానికి ఆర్బీఐ తీపి కబురు.. డివిడెండ్ కింద రూ.2.11 లక్షల కోట్లు..!
RBI dividend | కేంద్ర ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తీపి కబురు చెప్పింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.2.11 లక్షల కోట్లు డివిడెండ్గా చెల్లించాలని నిర్ణయించింది. గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో ఆర్బీఐ కేంద్ర బోర్డు డైరెక్టర్లు ఇవాళ సమావేశమయ్యారు. మిగులు నిధులను ప్రభుత్వానికి డివిడెండ్గా చెల్లించే అంశానికి ఈ సమావేశంలో ఆమోదం తెలిపారు.

RBI dividend : కేంద్ర ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తీపి కబురు చెప్పింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.2.11 లక్షల కోట్లు డివిడెండ్గా చెల్లించాలని నిర్ణయించింది. గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో ఆర్బీఐ కేంద్ర బోర్డు డైరెక్టర్లు ఇవాళ సమావేశమయ్యారు. మిగులు నిధులను ప్రభుత్వానికి డివిడెండ్గా చెల్లించే అంశానికి ఈ సమావేశంలో ఆమోదం తెలిపారు.
2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆర్బీఐ రూ.87,416 కోట్లను డివిడెండ్ రూపంలో చెల్లించింది. దాంతో పోలిస్తే 2023-24 ఆర్థిక సంవత్సరంలో 140 శాతం అధికంగా డివిడెండ్గా చెల్లిస్తుండటం గమనార్హం. ఈ ఏడాదికి రూ.75 వేల నుంచి 1.20 లక్షల వరకు ఆర్బీఐ నిధులను బదిలీ చేయవచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేయగా.. అంతకుమించి చెల్లించాలని ఆర్బీఐ బోర్డు నిర్ణయించింది.
ఆర్బీఐ ఇస్తున్న డివిడెండ్ కేంద్రం తన ద్రవ్య లోటును పూడ్చుకోవడానికి ఉపయోగపడనుంది. దేశీయంగా ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడంతో ఆర్బీఐ కంటిన్జెంట్ రిస్క్ బఫర్ లెవల్ను కూడా 6 శాతం నుంచి 6.50 శాతానికి పెంచింది. కాగా, ఏటా ఆర్బీఐ మిగులు నిధులను కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్ రూపంలో చెల్లిస్తుంటుంది. పెట్టుబడులు, డాలరు నిల్వలపై విలువల మధ్య వ్యత్యాసం, కరెన్సీ ప్రింటింగ్ ఫీజు తదితర రూపాల్లో ఆర్బీఐకి ఆదాయం సమకూరుతుంది.
ఇలా సమకూరిన ఆదాయంలో నుంచి మిగులు నిధులను కేంద్రానికి బదిలీ చేస్తుంటుంది. 2024-25 ఆర్థిక సంవత్సర తాత్కాలిక బడ్జెట్లో ఆర్బీఐ, ప్రభుత్వ రంగ బ్యాంకుల డివిడెండ్ల రూపంలో ఖజానాకు రూ.1.02 లక్షల కోట్లు సమకూరుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ క్రమంలో ఒక్క ఆర్బీఐ మాత్రమే అంచనాలకు మించి డివిడెండ్ ప్రకటించడాన్ని కేంద్రానికి బొనాంజాగానే చెప్పవచ్చు.