మేఘా ఇంజనీరింగ్ కంపనీపై సీబీఐ కేసు నమోదు చేయడం సంచలనంగా మారింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎన్ఐఎస్పీకి చెందిన రూ.315 కోట్ల ప్రాజెక్టులో అవినీతికి పాల్పడ్డారనే
విధాత, హైదరాబాద్ : మేఘా ఇంజనీరింగ్ కంపనీపై సీబీఐ కేసు నమోదు చేయడం సంచలనంగా మారింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎన్ఐఎస్పీకి చెందిన రూ.315 కోట్ల ప్రాజెక్టులో అవినీతికి పాల్పడ్డారనే అభియోగాలపై హైదరాబాద్కు చెందిన మేఘా ఇంజనీరింగ్ ఆండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెట్ సంస్థతో పాటు కేంద్ర ఉక్కు శాఖకు చెందిన ఎనిమిది మంది అధికారులపై సీబీఐ కేసు నమోదు చేసింది. కేసు నమోదైన అధికారులంతా కేంద్ర ఉక్కుశాఖ పరిధిలోని ఎన్ఎండీసీ ఐరన్ అండ్ స్టీల్ ప్లాంటుకు చెందిన అధికారులు కావడం గమనార్హం. మేఘా ఇంజినీరింగ్ సంస్థకు ఓ కాంట్రాక్టుకు సంబంధించిన పేమెంట్ చేసే విషయంలో ఎన్ఎండీసీకి చెందిన ఎనిమిది మంది అధికారులు, ప్రభుత్వ రంగ సంస్థ మెకాన్ లిమిటెడ్కు చెందిన ఇద్దరు అధికారులు లంచం పుచ్చుకున్నారని అందిన ఫిర్యాదు మేరకు సీబీఐ కేసు నమోదు చేసింది.
ఇటీవల ఎన్నికల సంఘం బహిర్గతం చేసిన వివరాల మేరకు దేశంలోని రాజకీయ పార్టీలకు ఎలక్ట్రోరల్ బాండ్ల విరాళాలలో రెండో అతిపెద్ద సంస్థగా మేఘా నిలిచింది. మేఘా ఇంజనీరింగ్ కంపెనీ, దాని సంబంధిత సంస్థ వెస్ట్రన్ యూ పవర్ ట్రాన్స్ మిషన్ కో… రూ. 1,186 కోట్ల విలువైన ఎలక్ట్రోరల్ బాండ్లను కొనుగోలు చేశాయి. ఇందులో మేఘా కంపెనీ ఏకంగా రూ.966 కోట్లు విలువైన ఎన్నికల పౌండ్లను కొనుగోలు చేయడం ద్వారా వివిధ రాజకీయ పార్టీలకు విరాళాలను అందించింది. ఈ కంపెనీల నుంచి అత్యధిక విరాళాలు బీజేపీ, బీఆరెస్కు అందడం చర్చనీయాంశమైంది.