పవిత్ర గంగా, యమునా నదుల్లో నీళ్లతో పాటు మృతదేహాలు ప్రవహిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లోని హమీర్పూర్, కాన్పూర్ జిల్లాల్లో కరోనా మృతులకు అంత్యక్రియలు నిర్వహించడానికి స్థలం లేక మృతదేహాలను నదుల్లో వదిలేస్తున్నారు. రోగులు ఇండ్లలో చనిపోతే కూడా కుటుంబసభ్యులు కరోనా భయంతో గుట్టు చప్పుడు కాకుండా శవాలను నదుల్లో కలిపేస్తున్నారు.
హమీర్పూర్ జిల్లాలో యమునా నదిలో ఆదివారం ఒక్కరోజే 40కి పైగా మృతదేహాలు కన్పించడం నది ఒడ్డున ఉన్న స్థానికులను భయాందోళనలకు గురిచేసింది. ఆ నీటి వల్ల తమకూ కరోనా ముప్పు ఉండొచ్చని వారంతా భయపడుతున్నారు. బీహార్లో గంగా నదిలో కూడా పదుల సంఖ్యలో మృతదేహాలు కనిపించాయి.
ఇవి యూపీ రాష్ర్టానికి చెందినవారివే కావొచ్చని అనుమానిస్తున్నారు. మరణాలను రికార్డు చేయడం లేదని చెప్తున్నారు. శ్మశాన వాటికల్లో రికార్డుల్లోకి రాకుండా స్థానిక అధికారులే మృతదేహాలను నదిలో వదలాలని నిర్ణయించుకొన్నట్టు విశ్వసనీయంగా తెలుస్తున్నది. అయితే మృతదేహాలు కరోనాతో మరణించినవి కాదని, సహజమరణాలేనని అధికారులు చెప్తున్నారు.