Warangal Crime | మేనత్తతో కలిసి మద్యం తాగి.. ఆపై మట్టుబెట్టిన మేనల్లుడు!

Warangal Crime | మద్యానికి అలవాటు పడి, జల్సాలకు అవసమైన డబ్బు కోసం మేనత్తను అతిదారుణంగా హత్యచేసి, ఒంటి మీద నగలను చోరీ చేసిన మేనల్లుడిని వరంగల్ జిల్లా గీసుగొండ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నిందితుడి నుండి రూ.18లక్షల విలువగల సుమారు 170 గ్రాముల బంగారు, 34 గ్రాముల వెండి అభరణాలతో పాటు పదివేల రూపాయల నగదు, ద్విచక్రవాహనం, ఒక సెల్ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ నగరంలోని రాజీవ్కాలనీ, మట్టెవాడకు చెందిన నిందితుడు రేకులపెల్లి ప్రణయ్ ( 23). ఈ అరెస్టుకు సంబందించి ఈస్ట్జోన్ డీసీపీ అంకిత్ కుమార్ వివరాలను వెల్లడించారు. ఈ నెల 7వ తారీఖున గీసుగొండ మండలం, స్థంబాలపల్లి గ్రామానికి చెందిన కొచన స్వరూప (70) అనే వృద్ధురాలిని గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసినట్లు మృతురాలి కుమారుడు ఫిర్యాదు చేశాడు. దానిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు.
నిందితుడు రేకులపెల్లి ప్రణయ్ ప్రైవేట్ ఉద్యోగాన్ని చేస్తూ జల్సాలు చేసేవాడు. ఇతరుల వద్ద అప్పులు చేశాడు. ఇండ్లల్లో నాలుగు చోరీలకు పాల్పడ్డాడు. అయిన నిందితుడి అప్పులు తీరలేదు. ఈ క్రమంలో స్థంభంపల్లి గ్రామంలో ఒంటరిగా నివాసం వుంటున్న మేనత్తపై దృష్టి పడింది. సంఘటన జరిగిన రోజు సాయంత్రం మేనత్త ఇంటికి చేరుకున్నాడు. మేనత్తతో కలిసి మద్యం సేవించి ఇంటిలోనే నిద్రించాడు. ఆమె నిద్రపోతుండగా డంబెల్తో తలపై కొట్టడంతో ఆమె మరణించింది. మృతురాలి ఒంటిపై వున్న బంగారు అభరణాలు, ఇంటిలోని వెండి సామాను, కొంత డబ్బును దోచుకొని వెళ్ళాడు. అనంతరం నిందితుడు వరంగల్లోని తన ఇంటికి తిరిగి వచ్చి రక్తమరకలతో కూడిన బట్టలను విప్పి యం.జి.యం వెళ్ళి గాయమైన చేతికి చికిత్స చేయించుకున్నాడు. ఈ కేసులో దర్యాప్తు జరిపిన పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేశారు.