విధాత(కర్నూలు): పత్తికొండలోని ప్రభుత్వ మద్యం దుకాణంలో (13192) రూ. 8, 51,150 విలువైన మద్యం సరకు స్వాహా ఉదంతం వివాదాస్పదంగా మారింది. ఇటీవల మద్య నిషేధ, అబ్కారీ శాఖ ఉప కమిషనర్ పరిధిలోని స్క్వాడ్ బృందంలో అధికారి సీఐ వెంకటేశ్వర్లు తమ సభ్యులతో కలసి సదరు మద్యం దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. విక్రయించిన సరకు వివరాలు.. దుకాణంలో ఉన్న సరకుతో పోల్చి చూడగా 2,201 మద్యం సీసాలు, 1,801 బీరు సీసాలు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. దుర్వినియోగమైన సరకు విలువ రూ.8,51,150గా అంచనా వేశారు.
విషయం తెలిసిన ఆ శాఖ జిల్లా ఉప కమిషనర్ జి.చెన్నకేశవరావు సదరు మొత్తాన్ని దుకాణం సూపర్వైజర్, సేల్స్మెన్ నుంచి రికవరీ చేసి ప్రభుత్వ ఖాతాకు జమ చేయాలని ఆ శాఖ నోడల్ పర్యవేక్షణాధికారి, కర్నూలు ఐఎంఎల్ డిపో మేనేజరు జి.నాగేశ్వరరావును ఆదేశించారు. మద్య నిషేధ, అబ్కారీ శాఖ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంతోనే మద్యం దుకాణ సిబ్బంది ఈ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దుకాణ సిబ్బంది నుంచి దాదాపు రూ.3 లక్షల వరకు రికవరీ చేసినట్లు తెలిసింది. మిగతా నగదు రికవరీ చేయనున్నారు.