Site icon vidhaatha

Padmavathi Temple | తిరుచానూరు పద్మావతి ఆలయంలో 14న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Padmavathi Temple | తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈ నెల 14న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా నిర్వహించనున్నారు. అమ్మవారి ఆలయంలో 22 నుంచి 24 వరకు వార్షిక వసంతోత్సవాలు వైభ‌వంగా జరుగనున్నాయి. ఈ ఉత్సవాల సందర్భంగా ఆల‌యంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. కార్యక్రమంలో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి ఉదయం 6 నుంచి 9 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు.

ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేస్తారు. నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. ఉదయం 9.30 గంటల నుండి భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు. కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం సందర్భంగా 14న కల్యాణోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది.

వసంతోత్సవాలకు ఉత్సవాలకు 21న సాయంత్రం 6 గంట‌ల‌కు అంకురార్పణ నిర్వహించనున్నారు. భక్తులు ఒక్కొక్కరు రూ.150 చెల్లించి వసంతోత్సవంలో పాల్గొన్నవచ్చని పేర్కొంది. ఉత్సవాల్లో భాగంగా మే 23న ఉదయం 7.45 గంటలకు స్వర్ణ రథోత్సవం కనులపండువగా జరుగనుంది. వసంతోత్సవాలు జరిగే మూడు రోజులు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు శుక్రవారపు తోటలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు.

Exit mobile version