Polala Amavasya | ఈ సంవ‌త్స‌రం శ్రావ‌ణ‌మాసం( Shravana Masam ) ఆగ‌స్టు 5వ తేదీన ప్రారంభ‌మైంది. సెప్టెంబ‌ర్ 2వ తేదీన అమావాస్య‌( Amavasya )తో శ్రావ‌ణ‌మాసం ముగియ‌నుంది. ఈ నెల రోజుల కాలంలో మ‌హిళ‌లు ఉప‌వాసాలు పాటిస్తూ.. వ‌ర‌ల‌క్ష్మి వ్ర‌తాల్లో( Varalakshmi Vratam ) మునిగిపోయారు. శుభ‌కార్యాలు కూడా చాలానే జ‌రిగాయి. అయితే శ్రావణ మాసంలో చివ‌ర్లో వ‌చ్చే అమావాస్య‌కు ఒక ప్ర‌త్యేక‌త ఉంది. ఆ అమావాస్యకు ఉన్న విశిష్ట‌త ఏంటో తెలుసుకుందాం.

సెప్టెంబ‌ర్ 2వ తేదీన సోమ‌వారం మొత్తం అమావాస్య ఘ‌డియ‌లు ఉన్నాయి. మ‌రుస‌టి రోజున మంగ‌ళ‌వారం ఉద‌యం 6 గంట‌ల 7 నిమిషాల వ‌ర‌కు కూడా అమావాస్య ఘ‌డియ‌లు ఉన్నాయి. సెప్టెంబ‌ర్ 4 నుంచి భాద్ర‌ప‌ద మాసం ప్రారంభం అవుతుంది. ఇక సెప్టెంబ‌ర్ 2న వ‌చ్చే అమావాస్య‌ను పోలాల అమావాస్య‌( Polala Amavasya )గా ప‌రిగ‌ణిస్తారు. పోలాల అమావాస్య రోజు వృషభ పూజ చేస్తారు. దీని వెనుక ఓకథనం ప్రచారంలో ఉంది. అంధకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ గురించి తపస్సు ఆచరించి ఎన్నో వరాలు పొందుతాడు. ఆ వరగర్వంతో దేవతలను వేధించేవాడు.. ఓసారి పార్వతీదేవి( Parvathi Devi )ని చూసి ఆమె కావాలి అనుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న శివుడు( Lord Shiva ) భూలోకానికి వచ్చి అంధకాసురుడిని శ్రీ మహావిష్ణువు సహకారంతో అంత‌మొందిస్తాడు. ఈ సమయంలో నంది తనకు చేసిన సహాయానికి మెచ్చి.. ఏదైనా వరం కోరుకోమని చెబుతాడు పమరేశ్వరుడు. అప్పుడు నంది.. స్వామీ మహర్షియైన శిలాధుని పొలంలో ఆదివృషభ రూపంగా నేను తనకి దొరికిన రోజు శ్రావణ బహుళ అమావాస్య. అందుకే ఆ రోజు వృషభ పూజ చేసిన భక్తుల అభీష్టాలు నెరవేరేలా ఆశీర్వదించమనే వరం కోరుకున్నాడు నంది. అప్పటి నుంచి శ్రావణమాసం అమావాస్య రోజు వృషభ పూజ చేయడం ప్రారంభించారు. ఇదే రోజు కొన్ని ప్రాంతాల్లో పోలాల అమావాస్య పూజను ఆచరిస్తారు.

పోలాల అమావాస్య వ్ర‌తం ఆచ‌రిస్తే.. సంతానం క‌లుగుతుందట‌..

పోలాల అమావాస్య వ్రతం ఆచరించేవారికి సంతానానికి సంబంధించి ఉన్న దోషాలు తొలగిపోతాయి. సంతానం ప్రసాదించడమే కాదు వారి ఆయురారోగ్యాలను కూడా పోలమ్మ ప్రసాదిస్తుందని భక్తుల విశ్వాసం. ఈ రోజు కంద మొక్కను పూజించి దానికి పసుపుకొమ్ములు కట్టి..పూజ అనంతరం ముత్తైదువులు ఆ పసుపు కొమ్ములను మంగళసూత్రానికి కట్టుకుంటారు.. అ పసుపుకొమ్ములు చిన్నారుల చేతికి కానీ మొలకు కానీ కడతారు. ఈ తోరం కడితే పిల్లలకు మృత్యభయం ఉండదని విశ్వశిస్తారు.