Engineering Fees | ఇంజినీరింగ్ విద్యార్థులకు అలెర్ట్.. ఈ ఏడాది ఫీజును ఖరారు చేసిన ఏపీ సర్కారు..!
Engineering Fees | బీటెక్, ఆర్కిటెక్చర్, ఇంజినీరింగ్ కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజులను ఏపీ సర్కారు ఖరారు చేసింది. ఇంజినీరింగ్లో బీటెక్ కోర్సులకు గరిష్ఠంగా రూ.1.03లక్షల నుంచి రూ.1.05లక్షలు.. కనిష్ఠంగా రూ.40వేలుగా నిర్ణయించారు.

Engineering Fees | బీటెక్, ఆర్కిటెక్చర్, ఇంజినీరింగ్ కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజులను ఏపీ సర్కారు ఖరారు చేసింది. ఇంజినీరింగ్లో బీటెక్ కోర్సులకు గరిష్ఠంగా రూ.1.03లక్షల నుంచి రూ.1.05లక్షలు.. కనిష్ఠంగా రూ.40వేలుగా నిర్ణయించారు. ఏపీలోని మొత్తం 210 బీటెక్, రెండు ఆర్చిటెక్చర్ ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి. ఇందులో రూ.40వేల ఫీజు ఉన్న కళాశాలలు 114, రూ.లక్షపైగా ఫీజులు ఉన్న కళాశాలలు ఎనిమిది ఉన్నాయి. రెండు ఆర్కిటెక్చర్ కళాశాలలకు రూ.35 వేల చొప్పున ఫీజును ఖరారు చేసింది. ట్యూషన్ , అఫిలియేషన్, గుర్తింపుకార్డు, మెడికల్, ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతర విద్యార్థి కార్యకలాపాలు తదితర ఖర్చులన్నీ ఇందులోనే వర్తిస్తాయి. అదనంగా కాలేజీ ఎలాంటి ఫీజులను వసూలు చేయొద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, వసతి, రవాణా, మెస్, రిజిస్ట్రేషన్, ప్రవేశ రిఫండబుల్ ఫీజులను మాత్రం ఇందులో చేర్చలేదు.
నిర్ణయించిన రుసుములకు మించి అదనంగా క్యాపిటేషన్, డోనేషన్లు తదితరాల పేరుతో ఎలాంటి మొత్తాన్ని వసూలు చేయొద్దని ప్రభుత్వం ఆదేశించింది. ఆదేశాలను ఉల్లంఘిస్తే చట్టప్రకారం జరిమానాతో పాటు చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. పెండింగ్లో ఉన్న రిట్ పిటిషన్లపై ఏపీ హైకోర్టు తీర్పునకు లోబడి ఫీజులు ఉంటాయని ఉత్తర్వుల్లో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి స్పష్టం చేశారు. గుంటూరులోని ఆర్వీఆర్అండ్జేసీ, విశాఖలోని గాయత్రీ విద్యాపరిషత్ విద్యా సంస్థలు, విజయవాడలోని ప్రసాద్ వీ పొట్లూరి సిద్ధార్థ, వీఆర్ సిద్ధార్థ, భీమవరంలోని ఎస్ఆర్కేఆర్, శ్రీవిష్ణు ఇంజినీరింగ్ కాలేజి ఫర్ ఉమెన్ కళాశాలలకు రూ.1.05 లక్షల చొప్పున , విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలకు రూ. 1.03 లక్షలుగా ప్రభుత్వం ఫీజులను ఖరారు చేసింది. ఇక విశాఖలోని జీవీపీ కాలేజీ ఫర్ డిగ్రీ, పీజీ కాలేజీకి రూ.92,400, పెద్దాపురంలోని ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల ఫీజు రూ.93,700గా ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.