TS SET Notification | తెలంగాణ రాష్ట్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్, డిగ్రీ కాలేజీల లెక్చరర్ ఉద్యోగాల అర్హత పరీక్ష అయిన టీఎస్ సెట్-2024 కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఉస్మానియా యూనివర్సిటీ దూరవిద్యా కేంద్రంలోని టీఎస్ సెట్ కార్యాలయంలో ఈ నోటిఫికేషన్ను విడుదల చేశారు.
TS SET notification : తెలంగాణ రాష్ట్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్, డిగ్రీ కాలేజీల లెక్చరర్ ఉద్యోగాల అర్హత పరీక్ష అయిన టీఎస్ సెట్-2024 కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఉస్మానియా యూనివర్సిటీ దూరవిద్యా కేంద్రంలోని టీఎస్ సెట్ కార్యాలయంలో ఈ నోటిఫికేషన్ను విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ విడుదల కార్యక్రమంలో ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలి చైర్మెన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, ఓయూ వీసీ ప్రొఫెసర్ రవిందర్ యాదవ్, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయ వీసీ ప్రొఫెసర్ గోపాల్ రెడ్డి, శాతవాహన యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఎస్ మల్లేశ్, ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పీ లక్ష్మీనారాయణ, ఓఎస్డీ ప్రొఫెసర్ రెడ్యానాయక్, సెట్ సభ్య కార్యదర్శి ప్రొఫెసర్ జీ నరేష్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రొఫెసర్ నరేష్ రెడ్డి మాట్లాడుతూ.. ఆగస్టు 28, 29, 30, 31వ తేదీల్లో 29 సబ్జెక్టుల్లో సెట్ పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు.
ఈనెల 14 నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నట్టు వెల్లడించారు. తెలంగాణ ఉమ్మడి 10 జిల్లా కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు సెంటర్లను ఎత్తేశారు. గతంలో మాదిరిగానే పరీక్ష ఫీజు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ట్రాన్స్జెండర్లకు రూ.1000, బీసీలకు రూ.1500, ఓసీలకు రూ.2000గా నిర్ణయించారు.
ఆసక్తిగల అభ్యర్థులు జూలై 2వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అపరాధ రుసుముతో జులై 26వ తేదీ వరకు సమయం ఉంటుంది. ఆగస్టు 20 తేదీ నుంచి వెబ్సైట్ ద్వారా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలి. 2023లో నిర్వహించిన టీఎస్ సెట్కు 33,866 మంది దరఖాస్తులు చేసుకోగా.. 2,278 మంది అభ్యర్థులు అర్హత సాధించారు.