Devansh | ఘ‌నంగా నారా దేవాన్ష్ ధోతీ వేడుక .. నారా–నందమూరి కుటుంబాల్లో ఆనందోత్సాహాలు

Devansh | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడు నివాసంలో శనివారం ఆనందోత్సాహాల మధ్య ప్రత్యేక వేడుక జరిగింది. ఆయన మనవడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ – బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్ ధోతీ (పంచెకట్టు) వేడుక హైదరాబాద్‌లోని వారి నివాసంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. సంప్రదాయబద్ధంగా జరిగిన ఈ కార్యక్రమంలో నారా – నందమూరి కుటుంబ సభ్యులు, సన్నిహితులు పాల్గొని సందడి చేశారు.

  • By: Sandeep |    movies |    Published on : Mar 15, 2026 8:56 AM IST
Devansh | ఘ‌నంగా నారా దేవాన్ష్ ధోతీ వేడుక .. నారా–నందమూరి కుటుంబాల్లో ఆనందోత్సాహాలు

Devansh | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడు నివాసంలో శనివారం ఆనందోత్సాహాల మధ్య ప్రత్యేక వేడుక జరిగింది. ఆయన మనవడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ – బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్ ధోతీ (పంచెకట్టు) వేడుక హైదరాబాద్‌లోని వారి నివాసంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. సంప్రదాయబద్ధంగా జరిగిన ఈ కార్యక్రమంలో నారా – నందమూరి కుటుంబ సభ్యులు, సన్నిహితులు పాల్గొని సందడి చేశారు.

పంచెకట్టు కట్టుకుని సంప్రదాయ వేషధారణలో మెరిసిపోయిన దేవాన్ష్‌ను చూసి తాతలు చంద్ర‌బాబు నాయుడు, బాల‌కృష్ణ ఎంతో ఆనందించారు. పెద్దల ఆశీర్వాదాలు తీసుకుంటూ దేవాన్ష్ నమస్కరించగా కుటుంబ సభ్యులందరూ గర్వంగా భావించారు.

తెలుగు సంప్రదాయంలో ధోతీ వేడుక ప్రత్యేకత

తెలుగు సంప్రదాయంలో ధోతీ వేడుకకు ఎంతో ప్రాధాన్యం ఉంది. సాధారణంగా బాలురకు 5 నుంచి 12 ఏళ్ల మధ్య ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. బాల్యం నుంచి కౌమార దశకు అడుగుపెడుతున్న సంకేతంగా దీనిని భావిస్తారు. ఇది కేవలం దుస్తుల మార్పు మాత్రమే కాదు; మన సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించడం, క్రమశిక్షణతో జీవించడం వంటి విలువలను పిల్లలకు తెలియజేసే ఆచారం కూడా.

రెండు కుటుంబాల సందడి

ఈ వేడుక ఆద్యంతం రెండు కుటుంబాల కలయికతో ఎంతో ఉల్లాసంగా సాగింది.చంద్ర‌బాబు నాయుడు- భువనేశ్వరి దంపతులు తమ మనవడిని ఆశీర్వదించి మురిసిపోయారు. మరోవైపు బాల‌కృష్ణ‌– వసుంధర దంపతులు కూడా వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక‌ అతిథులను స్వాగతిస్తూ నారా లోకేష్‌– బ్రాహ్మణి దంపతులు వేడుకలో సంద‌డి చేశారు.

ఈ సందర్భంగా లోకేష్ సోషల్ మీడియాలో స్పందిస్తూ, “దేవాన్ష్ పెద్దవాడిగా ఎదుగుతూ మన సంప్రదాయాలను అందంగా ఆచరిస్తుండటం మా కుటుంబానికి ఎంతో గర్వకారణం” అని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

చదరంగంలో దేవాన్ష్ ప్రతిభ

దేవాన్ష్ కేవలం రాజకీయ వారసుడిగానే కాకుండా చదరంగంలో కూడా అసాధారణ ప్రతిభ కనబరుస్తున్నాడు. ప్రస్తుతం పాఠశాల విద్యను అభ్యసిస్తున్న దేవాన్ష్ కొన్నేళ్లుగా చెస్‌లో అద్భుతమైన ప్రదర్శనతో గుర్తింపు పొందుతున్నాడు.

2025లో లండన్‌లోని వెస్ట్‌మిన్‌స్టర్ హాల్‌లో వ‌ర‌ల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ దేవాన్ష్‌ను సత్కరించింది. చదరంగంలో అత్యంత వేగంగా 175 చెక్‌మేట్ పజిల్స్‌ను పరిష్కరించి ప్రపంచ రికార్డు సృష్టించాడు.

కఠిన సాధనతో ఎదుగుతూ…

చదరంగంపై దేవాన్ష్‌కు ఉన్న ఆసక్తి వెనుక కఠినమైన శిక్షణ ఉంది. తన కోచ్ కె. రాజశేఖర్ రెడ్డి పర్యవేక్షణలో రోజుకు ఐదు నుంచి ఆరు గంటల పాటు సాధన చేస్తూ తన నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంటున్నాడు.

గతంలో దేవాన్ష్ తొమ్మిది చెస్ బోర్డులపై ఉన్న మొత్తం 32 పావులను కేవలం ఐదు నిమిషాల్లో కచ్చితంగా అమర్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అలాగే ‘టవర్ ఆఫ్ హనోయ్’ పజిల్‌ను కేవలం 1 నిమిషం 43 సెకన్లలో పూర్తి చేసి మరో ప్రత్యేక రికార్డు నెలకొల్పాడు.

మోక్షజ్ఞ ప్రత్యేక ఆకర్షణ

రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉండే చంద్ర‌బాబు,లోకేష్ కుటుంబ సభ్యుల మధ్య ఈ వేడుకను ఘనంగా నిర్వహించడం విశేషంగా మారింది. ఈ కార్యక్రమంలో నందమూరి కుటుంబానికి చెందిన యువ వారసుడు నంద‌మూరి మోక్ష‌జ్ఞ‌ కూడా ప్రత్యేకంగా కనిపించారు.

మనవడు దేవాన్ష్ ఆయురారోగ్యాలతో మరిన్ని విజయాలు సాధించాలని రెండు కుటుంబాల పెద్దలు ఆశీర్వదించారు. రాజకీయాల కంటే మనవడి ఆనందమే తనకు ముఖ్యమన్నట్లుగా చంద్రబాబు నాయుడు ఈ వేడుకలో పూర్తి ఉత్సాహంగా పాల్గొనడం అక్కడి వాతావరణాన్ని మరింత ఉత్సాహభరితంగా మార్చింది.