Telugu Film Chamber Elections | హోరా హోరీగా తెలుగు ఫిలిం ఛాంబ‌ర్ ఎన్నిక‌లు.. పీఠం ఎవ‌రికి ద‌క్కేను?

Telugu Film Chamber Elections | తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి (తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్) 2025–27 కార్యవర్గ ఎన్నికల పోలింగ్ ఆదివారం ఉదయం ప్రారంభమైంది. హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లోని ఛాంబర్ కార్యాలయంలో ఉదయం 8 గంటలకు మొదలైన ఓటింగ్, మధ్యాహ్నం 1 గంటల వరకు కొనసాగనుంది. ఈ ఎన్నికలు టాలీవుడ్‌లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి.

Reported by: Sandeep | సినిమా | Dec 28, 2025, 10:38 am IST
Read Time: 4 mins
Telugu Film Chamber Elections | హోరా హోరీగా తెలుగు ఫిలిం ఛాంబ‌ర్ ఎన్నిక‌లు.. పీఠం ఎవ‌రికి ద‌క్కేను?

Telugu Film Chamber Elections | తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి (తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్) 2025–27 కార్యవర్గ ఎన్నికల పోలింగ్ ఆదివారం ఉదయం ప్రారంభమైంది. హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లోని ఛాంబర్ కార్యాలయంలో ఉదయం 8 గంటలకు మొదలైన ఓటింగ్, మధ్యాహ్నం 1 గంటల వరకు కొనసాగనుంది. ఈ ఎన్నికలు టాలీవుడ్‌లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి.ఈ ఎన్నికల్లో ప్రముఖ నిర్మాతలు డి. సురేష్ బాబు, దిల్ రాజు నేతృత్వంలోని ప్రోగ్రెసివ్ ప్యానెల్ ఒకవైపు, సీనియర్ నిర్మాతలు సి. కళ్యాణ్, చదలవాడ శ్రీనివాసరావు నాయకత్వంలోని మన ప్యానెల్ మరోవైపు నిలిచి గట్టి పోటీ ఇస్తున్నాయి.

గెలుపెవ‌రిది?

మొత్తం 3,355 మంది సభ్యులు ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో నిర్మాతల విభాగం నుంచి 1,703 మంది, డిస్ట్రిబ్యూటర్ల విభాగం నుంచి 631 మంది, ఎగ్జిబిటర్ల విభాగం నుంచి 916 మంది, స్టూడియో సెక్టార్ నుంచి 105 మంది సభ్యులు ఉన్నారు. ఈ ఎన్నికల ద్వారా నాలుగు సెక్టార్లకు ఛైర్మన్‌లతో పాటు 44 మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకోనున్నారు. అనంతరం, ఎన్నికైన కార్యవర్గ సభ్యులు ఛాంబర్ అధ్యక్షుడిని ఎంపిక చేస్తారు. నిబంధనల ప్రకారం ఈసారి అధ్యక్ష పదవి ఎగ్జిబిటర్స్ సెక్టార్‌కు కేటాయించబడింది. దీంతో ప్రోగ్రెసివ్ ప్యానెల్ తరఫున డి. సురేష్ బాబు, మన ప్యానెల్ మద్దతుతో నట్టి కుమార్ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నట్లు సమాచారం. గత కమిటీ పదవీకాలం జులై 2025లో ముగియగా, సుమారు ఆరు నెలల ఆలస్యంగా ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి.

ఎన్నికలను వెంటనే నిర్వహించాలని సి. కళ్యాణ్ సహా పలువురు సీనియర్ నిర్మాతలు డిమాండ్ చేయడంతో ఈ పోలింగ్‌కు మార్గం ఏర్పడింది. ఎన్నికల ప్రచారంలో ఇరు ప్యానెల్స్ మధ్య తీవ్ర ఆరోపణలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా, కొందరు పెద్ద నిర్మాతలు చిన్న నిర్మాతలను పట్టించుకోవడం లేదని, పరిశ్రమలో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని మన ప్యానెల్ ఆరోపించింది. మరోవైపు, ఓటీటీ విడుదల నిబంధనలు, కార్మికుల వేతనాల పెంపు, పరిశ్రమ స్థిరత్వం వంటి అంశాలు ప్రచారంలో కీలకంగా మారాయి.మధ్యాహ్నం 1 గంటకు పోలింగ్ ముగిసిన అనంతరం ఓట్ల లెక్కింపు ప్రారంభించనుండగా, సాయంత్రానికల్లా ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. కొత్తగా బాధ్యతలు చేపట్టే కార్యవర్గం ఎవరిది అవుతుందన్న దానిపై టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.