Post Office | దేశంలో శతాబ్దాలుగా కొనసాగుతున్న వ్యవస్థాగత సేవల్లో తపాలాకు ప్రత్యేక స్థానం ఉంది. సమాచార వ్యవస్థలో తొలి అడుగుగా ప్రారంభమైన ఈ వ్యవస్థ దేశ వ్యాప్తంగా తన పరిధిని, సేవలను విస్తరించింది. ఎప్పటికప్పుడు సంస్థాగత మార్పులు చేసుకుంటూ, ఆధునిక ధోరణుల్ని అనుసరిస్తూ విజయవంతంగా కొనసాగుతోంది.
భారతదేశంలో మౌర్య సామ్రాజ్యంలో పాలనా అవసరాల కోసం తపాలా వ్యవస్థ ప్రారంభమైనట్లు ఆధారాలు ఉన్నాయి. మధ్య యుగంలో 14వ శతాబ్దంలో మైసూరును పాలించిన వడయార్లు కూడా పరిపాలనా అవసరాల కోసం ఈ వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఆధునిక యుగంలో ఆంగ్లేయ పాలనలో ఈస్టిండియా కంపెనీ తన వాణిజ్య వ్యవహారాలు, నిర్వహణ నిమిత్తం తపాలా వ్యవస్థను నడిపింది. 1727లో కలకత్తాలో తొలిసారిగా ఆధునిక తపాలా కార్యాలయం ప్రారంభమైంది. 1774లో కలకత్తాలో, 1786లో మద్రాస్లో, 1793లో బొంబాయిలో సాధారణ తపాలా కార్యాలయాలు ప్రారంభమయ్యాయి. 1837లో తపాలా కార్యాలయం చట్టం వచ్చింది. దీని స్థానంలో 1854లో మరింత సమగ్ర చట్టం ప్రవేశపెట్టారు.
తపాలా సేవలను సత్వరం అందించడానికి కొన్ని ప్రత్యేక ఛానళ్లను ఏర్పాటు చేశారు. వాటి ద్వారా బట్వాడా చేయడం ప్రారంభించారు. దేశంలో మెట్రోనగరాలైన ముంబై, కోల్కతా, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్ మధ్య బట్వాడాకు మోట్రో ఛానల్ సర్వీసులను ప్రారంభించారు. ఈ ఛానల్ కోసం ప్రత్యేకంగా ‘నీలం రంగు’ తపాలా పెట్టెలను ఏర్పాటు చేశారు. ఢిల్లీ నుంచి ఇతర ప్రాంతాలకు చేసే బట్వాడా రాజధాని ఛానల్ ద్వారా జరుగుతుంది. ఈ ఛానల్ కోసం పసుపు రంగు తపాలా పెట్టెలను ఏర్పాటు చేశారు. గ్రీన్ ఛానల్ ప్రధాన నగరాల్లో స్థానికంగా బట్వాడా చేస్తారు. అందుకు ఆకుపచ్చ తపాలా పెట్టెలను ఉంచుతారు.
బిజినెస్ ఛానల్ ద్వారా కేవలం వ్యాపార సంబంధిత ఉత్తరాలు, ఇతర బిల్లులు బట్వాడా చేస్తారు. నెలలో, వారంలో, ఒకసారి వెలువడే న్యూస్ పేపర్లు, మ్యాగజైన్లు వంటి బట్వాడా కోసం పీరియాడికల్ ఛానల్ను వాడతారు. కేవలం మనీ ఆర్డర్లు, ఆన్లైన్ ద్వారా బదిలీ చేయడానికి ఉద్దేశించినది ఉపగ్రహ ఛానల్. దీనివల్ల మనీ ఆర్డర్లు సులభతరం, వేగవంతం అవుతాయి. బల్క్ మెయిల్ ఛానల్ను రిజిస్టర్, బిజినెస్ ఉత్తరాల కోసం ఉపయోగిస్తారు.
భారత రాజ్యాంగం ప్రకారం తపాలా సేవలు కేంద్ర జాబితాలో ఉన్నాయి. తపాలా కార్యాలయాలు కార్డులు, ఇన్లాండ్ కవర్లు, ఎన్వలప్, తపాలా బిల్లలు విక్రయించడం, జాతీయ, అంతర్జాతీయ ఉత్తరాలు, పార్శిళ్లు బట్వాడా చేయడం, పోస్టల్ ఆర్డర్లు విక్రయించడం, మనీఆర్డర్ ద్వారా నగదు బదిలీ చేయడం, పొదుపు ఖాతాలు నిర్వహించడం, జాతీయ పొదుపు ఖాతాలు, కిసాన్ వికాస్ పత్రాలు విక్రయించడం, తపాలా జీవిత బీమా, పాస్ పోర్టు దరఖాస్తుల సేవలు అందిస్తాయి. ప్రభుత్వ విధానాలకు సంబంధించిన సమాచార వ్యాప్తితో పాటు సాంఘిక భద్రతా ప్రయోజనాల పంపిణీ వంటి నిధులు నిర్వర్తిస్తున్నాయి..