మరదలికి ఎయిడ్స్​ రక్తం ఎక్కించిన బావ : అమ్మాయి ఆత్మహత్య

నను దూరం పెట్టిందన్న అక్కసుతో ప్రేమించిన అమ్మాయికి ఓ యువకుడు హెచ్‌ఐవీ రక్తం ఎక్కించిన ఘటనలో విషాదం చోటుచేసుకుంది.బాధిత యువతి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

Reported by: Y.V. Narsimha Reddy | హైదరాబాద్​ | Apr 10, 2026, 2:42 pm IST
Read Time: 3 mins
మరదలికి ఎయిడ్స్​ రక్తం ఎక్కించిన బావ : అమ్మాయి ఆత్మహత్య

Revenge Over Cancelled Marriage: Man Injects HIV Blood Into Fiancée, Woman Dies by Suicide

విధాత, హైదరాబాద్ :

తనను దూరం పెట్టిందన్న అక్కసుతో ప్రేమించిన అమ్మాయికి ఓ యువకుడు హెచ్‌ఐవీ రక్తం ఎక్కించిన ఘటనలో విషాదం చోటుచేసుకుంది.బాధిత యువతి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. యువతి మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.

మేడ్చల్ జిల్లా పోచారం ఐటీకారిడార్ పోలీసుస్టేషన్ పరిధిలో గత నెల 11న పెళ్లికి నిరాకరించినందుకు ప్రేమికుడు ఆ యువతికి హెచ్‌ఐవీ రక్తాన్ని ఎక్కించి పారిపోయాడు. బావ మరదళ్లయిన యువతి యువకుడికి పెద్దలు ముందుగా పెళ్లి నిర్ణయించారు. అయితే పెళ్లికి ముందు వైద్య పరీక్షల్లో యువకుడికి హెచ్ఐవీ పాజిటీవ్ గా తేలింది. దీంతో అతడితో యువతి తల్లిదండ్రులు పెళ్లిని రద్దు చేసుకున్నారు. అప్పటి నుంచి ఆ యువకుడు పగ పెంచుకుని…యువతి ఇంట్లో ఎవరు లేని సమయంలో దూసుకెళ్లి హెచ్ఐవీ రక్తంతో కూడిన ఇంజక్షన్ ఇచ్చాడు.

ఈ విషయం ఆలస్యంగా తెలిసిన యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. యువతికి నిర్వహించిన రక్త పరీక్షల్లో మొదట నెగెటివ్ ఫలితం వచ్చినట్లు వెల్లడించారు. మరికొన్ని నెలల తర్వాత మళ్లీ పరీక్షలు నిర్వహించాల్సి ఉందని తెలిపారు.

అయితే ఈ ఘటనతో తీవ్ర మానసిక ఆవేదనకు గురైన యువతి… ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించగా… కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.