కల్మా హోంవర్క్‌పై వివాదం.. టీచర్‌పై వేటు

హైదరాబాద్ సయీదాబాద్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో రెండో తరగతి హిందూ విద్యార్థికి 'కల్మా', 'సూరా ఫాతిహా' హోంవర్క్ ఇవ్వడం వివాదాస్పదమైంది. ఘటనపై టీచర్‌ను యాజమాన్యం ఉద్యోగం నుంచి తొలగించింది.

హైదరాబాద్ సయీదాబాద్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 2వ తరగతి విద్యార్థులకు “కల్మా” చదవాలని హోంవర్క్ ఇవ్వడం వివాదానికి దారితీసింది. ఈ ఘటనపై తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఘటనపై పాఠశాల యాజమాన్యం స్పందించి.. అందుకు బాధ్యులైన సంబంధిత టీచర్‌ను ఉద్యోగం నుంచి తొలగించింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోంది. స్కూల్ ప్రాంగణంలో తల్లిదండ్రులు, యాజమాన్యం మధ్య వాగ్వాదం జరిగిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

సౌత్ జోన్ డీసీపీ ఖరే కిరణ్ ప్రభాకర్ తెలిపిన వివరాల మేరకు..ఆ తరగతిలో 25 మంది విద్యార్థుల్లో 24 మంది ముస్లింలు, ఒకరు హిందూ విద్యార్థి ఉన్నారు.రెండో తరగతి చదువుతున్న హిందూ విద్యార్థికి ఇస్లామిక్ మతానికి సంబంధించిన సూరాలను హోంవర్క్‌గా ఇవ్వడం ఈ వివాదానికి కారణమైంది. ఇలాంటి హోంవర్క్ ఇవ్వడం విద్యా విధానం, పాఠశాల విధానాలకు విరుద్ధమని స్పష్టం చేశారు.

వివరాల్లోకి వెళితే.. సైదాబాద్ ప్రాంతంలోని ‘సక్సెస్’ అనే ప్రైవేట్ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న విద్యార్థికి నిన్న‌ ‘దీనియాత్’ సబ్జెక్టు కింద ‘సూరా ఫాతిహా’ చదవాలని స్కూల్ డైరీలో హోంవర్క్ రాశారు. అంతకుముందు ఈ నెల‌ 11న ‘కల్మా’ చదవాలని రాసి, అది ముస్లింయేతర విద్యార్థి అని గ్రహించి టీచర్ దానిని కొట్టివేసినట్లు తెలిసింది. ఈ విషయాన్ని గమనించిన విద్యార్థి తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యాన్ని సంప్రదించి తీవ్ర నిరసన తెలిపారు. విద్యాసంస్థలో ఇలాంటి మతపరమైన అంశాలను రుద్దడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

తల్లిదండ్రుల నిరసనతో పాఠశాల యాజమాన్యం వెంటనే స్పందించింది. ఇది పొరపాటున జరిగినప్పటికీ, ఉపాధ్యాయురాలిని ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగిస్తున్నట్లు ప్రకటించింది. భవిష్యత్తులో ‘సక్సెస్’ విద్యాసంస్థల గ్రూపులో ఆమె ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోకుండా అనర్హురాలిగా ప్రకటించారు. తమ పాఠశాలలో ఎక్కువ మంది ముస్లిం విద్యార్థులు ఉన్నారని, వారికి ‘దీనియాత్’ (ఇస్లామిక్ బోధన) సబ్జెక్టు ఉంటుందని, అయితే ఆ సబ్జెక్టును ఇతర మతాల విద్యార్థులకు బోధించమని యాజమాన్యం వివరణ ఇచ్చింది.

ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్..

ఈ ఘటనపై ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా స్పందించారు. రెండో తరగతి విద్యార్థిపై ‘కల్మా’ చదవాలని పాఠశాల యాజమాన్యం ఒత్తిడి చేయడం సిగ్గుచేటని ఆయన అన్నారు. “తెలంగాణలో ఇలాంటి ఘటనలు కొత్తేమీ కాదు. గతంలోనూ చాలా జరిగాయి. హిందూ పిల్లాడిని కల్మా చదవాలని ఎలా ఒత్తిడి చేస్తారని తల్లిదండ్రులు ప్రశ్నిస్తే, స్కూల్ యాజమాన్యం వద్ద సమాధానం లేదు,” అని ఆయన పేర్కొన్నారు. హిందువులకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలలో ఇదంతా భాగమేనని ఆరోపించారు.

హిందూ విద్యార్థులను బలవంతం చేస్తున్న ఇలాంటి పాఠశాలలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయంలో హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఎందుకు మౌనంగా ఉన్నారని రాజాసింగ్ ప్రశ్నించారు.

Latest News