అమెరికాలో వివిధ రకాల ప్రమాదాల బారిన పడి తెలుగు విద్యార్థులు వరుసగా చనిపోతున్న ఘటనలు మరువకముందే మరో తెలుగు విద్యార్థిని అదృశ్యమవ్వడం కలకలం రేపింది.
విధాత, హైదరాబాద్ : అమెరికాలో వివిధ రకాల ప్రమాదాల బారిన పడి తెలుగు విద్యార్థులు వరుసగా చనిపోతున్న ఘటనలు మరువకముందే మరో తెలుగు విద్యార్థిని అదృశ్యమవ్వడం కలకలం రేపింది. హైదరాబాద్కు చెందిన నితీషా కందుల అనే విద్యార్థిని లాస్ ఏంజిల్స్లో తప్పిపోయినట్లుగా తెలుస్తుంది. అమెరికా కాలమానం ప్రకారం గత శుక్రవారం రాత్రి నుంచి ఆమె అదృశ్యమైనట్లు తెలుస్తోంది.
శాన్బెర్నార్డినోలోని కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీలో నితీషా కందుల మాస్టర్స్ చదువుతోంది. అయితే శుక్రవారం రాత్రి నుంచి నితీషా కనిపించకపోవడంతో ఆమె సన్నిహితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆమె మొబైల్కు కాల్ చేసినా కూడా స్పందించడం లేదు. దీంతో సాయం కోసం వాట్సాప్ ద్వారా ఆమె కుటుంబ సభ్యులు అభ్యర్థిస్తున్నారు. అదృశ్యమైన నితీషా కనిపిస్తే +91 80749 62618 నంబర్కు సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.