న్యూఢిల్లీ : సామాన్యులు సైతం ఫైల్ చేసేలా ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయపు పన్న చట్టం తీసుకరానున్నట్లుగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఐటీ రిటర్న్స్ విధానం సరళతరంగా ఉండేలా కొత్త ఫారాలు అందుబాటులోకి తెస్తామని, పలు మార్పులు చేస్తామని చెప్పారు. అలాగే సవరించిన పన్ను రిటర్న్స్ దాఖలు గడువును డిసెంబర్ 31నుంచి మార్చి 31వరకు పొడిగించినట్లుగా ప్రకటించారు. విద్య, వైద్యంపై టీడీఎస్ 5శాతం నుంచి 2శాతానికి తగ్గించారు. విదేశీ యాత్రలపై ట్యాక్స్ తగ్గించారు. చిన్న పన్ను చెల్లింపు దారుల కోసం ప్రత్యేక పథకం ప్రకటించారు.
ఎన్నారైలకు గుడ్ న్యూస్
భారతీయ స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే ప్రవాస భారతీయులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గుడ్ న్యూస్ తెలిపారు. భారత స్టాక్ మార్కెట్లో వారు పెట్టే పెట్టుబడుల పరిమితి పెంపునకు అవకాశం కల్పించింది. మహిళలు నిర్వహించే పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, షీమార్టుల ఏర్పాటు ప్రకటించారు.
ఏడు హైస్పీడ్ రైల్ కారిడార్లు
ఏడు నగరాల మధ్య హైస్పీడ్ రైల్ కారిడార్లు ఏర్పాటును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించార. ముంబయి-పుణె, పుణె-హైదరాబాద్, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై, ఢిల్లీ-వారణాసి, వారణాసి-సిలిగుడి, చెన్నై-బెంగళూరు మధ్య ఏడు కారిడార్లను ప్రకటించారు. మౌలిక సదుపాయాల కల్పనకు రూ.12.2 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు.
భారత్ లో డేటా సెంటర్లు ఏర్పాటు చేసే క్లౌడ్ సంస్థలకు 2047 వరకూ ట్యాక్స్ హాలీడే ప్రకటించారు. నేషనల్ సెమీ కండక్టర్ మిషన్ ప్రకటించారు. దీనికి రూ.40వేల కోట్ల బడ్జెట్ కేటాయించారు. నేషనల్ డిజిటల్ విజ్ఞాన కేంద్రం ఏర్పాటు, మూడు ఆయుర్వేద ఆసుపత్రుల ఏర్పాటు, 5 ప్రాంతీయ వైద్య కేంద్రాలు, విద్య, వైద్య పరిశోధనలు సంస్థల ఏర్పాటు, సీ స్టేషన్ల ఏర్పాటును ప్రకటించారు.
ప్రతి జిల్లాలో బాలికల వసతి గృహాలను ఏర్పాటు చేయనున్నట్లుగా తెలిపారు. టైక్స్టైల్ రంగం కోసం వచ్చే ఐదేళ్లకు రూ.10వేల కోట్లు కేటాయించారు. దివ్యాంగులకు చేయూతగా దివ్యాంజన్ కౌశల్ యోజన, దివ్యాంగ్ సహకార యోజన పథకాలు, మానసిక వ్యాధుల చికిత్సకు నిమ్స్హన్స్, రాంచీ, తేజ్పుర్లలో ఏర్పాటు చేయనున్నట్లుగా తెలిపారు.
కేంద్ర బడ్జెట్ 2026-27లో వివిధ రంగాలకు నిధులు-కేటాయింపులు
రవాణా రంగానికి అత్యధికంగా రూ.5,98,520 కోట్లు కేటాయించగా.. గ్రామీణాభివృద్ధికి రూ.2,73,108 కోట్లు, రక్షణ రంగానికి రూ.5,04,585 కోట్లు, హోం వ్యవహారాలకు రూ.2,55,734 కోట్లు, వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాలకు రూ.1,62,671 కోట్లు, విద్య శాఖకు రూ.1,39,309 కోట్లు, సామాజిక సంక్షేమానికి రూ.1,09,025 కోట్లు, ఆరోగ్య రంగానికి రూ.1,04,599 కోట్లు, పట్టణాభివృద్ధికి రూ.85,522 కోట్లు, ఐటీ, టెలికాం రంగానికి రూ.74,560 కోట్లు, వాణిజ్య, పరిశ్రమల శాఖకు రూ.70,206 కోట్లు, శాస్త్రీయ విభాగాలకు రూ.55,756 కోట్లు, పన్నుల పరిపాలనకు రూ. 45,500 కోట్లు, విదేశాంగ వ్యవహారాలకు రూ.22,119 కోట్లు, ఆర్థిక శాఖకు రూ. 20,649 కోట్లు కేటాయించారు. ఉత్తర తూర్పు రాష్ట్రాల అభివృద్ధికి రూ. 6,812 కోట్లు ప్రత్యేకంగా కేటాయించినట్లు బడ్జెట్లో పేర్కొన్నారు.
